High Court టీఎస్పీఎస్సీని తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు లక్షల మంది ఎదురుచూసే అంశంలో జాప్యం వద్దు సోమవారంలోగా నిర్ణయం తీసుకోండి టీఎస్పీఎస్సీకి సూచించిన న్యాయస్థానం తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా హైదరాబాద్, విధాత: రాష్ట్రంలో ఈ నెల 29, 30న నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల అభ్యర్థనపై ఈనెల 14వ తేదీలోగా నిర్ణయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వినతులపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ […]
High Court
హైదరాబాద్, విధాత: రాష్ట్రంలో ఈ నెల 29, 30న నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల అభ్యర్థనపై ఈనెల 14వ తేదీలోగా నిర్ణయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వినతులపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) హైకోర్టుకు తెలుపడంతో ఈ మేరకు హైకోర్టు అనుమతిచ్చింది.
అంతకు ముందు గ్రూప్-2అభ్యర్థుల పిటిషన్ పై జరిగిన విచారణలో కోర్టులో 150 మందే పిటిషన్ వేశారని, మిగతా అభ్యర్థులంతా గ్రూప్-2 నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని టీఎస్పీఎస్సీ చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. లక్షల మంది కోర్టులో పిటిషన్ వేయలేరు కదా అని వ్యాఖ్యానించింది. వాయిదాపై నిర్ణయం వెల్లడించడానికి తొలుత మరింత సమయం కావాలని టీఎస్పీఎస్సీ కోరగా, న్యాయస్థానం నిరాకరించింది. లక్షల మంది ఎదురు చూసే అంశంలో జాప్యం వద్దని చెప్పింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
గ్రూప్-2 పరీక్షను రీ షెడ్యూల్ లేదా వాయిదా వేయాలని కోరుతూ పరీక్ష రాసే అభ్యర్థులు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ నెల 29, 30న నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సీహెచ్.చంద్రశేఖర్తో పాటు 149 మంది హైకోర్టును ఆశ్రయించారు. గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్.. తదితర 21 నియామక పరీక్షలు ఒకే నెలలో ఉన్న నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై జూన్ 26న, జూలై 24న రెండుసార్లు టీఎస్పీఎస్సీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందించలేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. న్యాయవాది బి.నర్సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ మాధవీ దేవి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆలూరి గిరిధర్రావు వాదనలు వినిపిస్తూ.. ‘ఒక్క ఆగస్టులోనే గ్రూప్-2తో పాటు 21 ఉద్యోగ నియామక పరీక్షలున్నాయి.
గ్రూప్-2.. అత్యంత ముఖ్యమైన పరీక్ష. సమర్థులనే తీసుకోవాల్సి ఉంది. దీని కోసం వారు పూర్తిగా సన్నద్ధం అయ్యేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం ఇవ్వాలి. హడావుడి పరీక్ష నిర్వహణ నియామక ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. అది అభ్యర్థులకు, ప్రభుత్వానికి మంచిది కాదు. టీఎస్పీఎస్సీ వివరణకు న్యాయస్థానం మరింత సమయం ఇస్తే.. హాల్టికెట్లు ఇచ్చేశాం.. ఇప్పటికే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు.. అని చెబుతారు. గ్రూప్-1కు ఇలానే చెప్పి పరీక్ష హడావుడిగా నిర్వహించారు.
అందువల్ల గ్రూప్-2 వాయిదాపై ఏ నిర్ణయమో త్వరగా తెలియజేయాలి. అభ్యర్థులు ఇతర పరీక్షలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుంది’అని వివరించారు. ప్రతిగా టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ‘రాష్టవ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, 1,500కుపైగా పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసి, ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని, ఆ రెండు రోజులు పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించారని తెలిపారు.
ఇప్పడు వాయిదా వేయాలని కోరడం సమంజసం కాదన్నారు. గురుకుల పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు చాలా తక్కువేనని తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరుపు వాదనలు హైకోర్టు తోసిపుచ్చడంతో ఈనెల 14వ వరకు టీఎస్పీఎస్సీ నిర్ణయం వెల్లడిస్తాం’అని నివేదించారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి కేసు వాయిదా వేసింది.