ఆక్టోబర్ 2న నారా భువనేశ్వరీ దీక్ష

విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి ఆక్టోబర్ 2వ తేదీన ఆయన సతీమణి నారా భువనేశ్వరీ నిరాహార దీక్ష చేస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
శనివారం నంద్యాలలో సమావేశమైన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆక్టోబర్ 2న రాత్రి 7గంటల నుంచి 7.05నిమిషాల వరకు ప్రతి ఇంట్లో లైట్లు ఆర్పీ, ఇంటి వరండాలలో కొవ్వోత్తులు వెలిగించి ప్రజలు నిరసన తెలుపాలని సూచించారు.
చంద్రబాబు అరెస్టుతో ఇప్పటికే 97మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను త్వరలో పరామార్శించనున్నట్లుగా తెలిపారు. అటు జనసేన-టీడీపీ కార్యక్రమాల నిర్వాహణకు జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలన్నారు.
ఆదివారం నుంచి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కొనసాగే పవన్ వారహి యాత్రకు టీడీపీ మద్దతునిస్తుందన్నారు. ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వారాహి యాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దెబ్బకు దెబ్బ కోతకు కోడ అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్కు ఆయన వార్నింగ్ ఇచ్చారు. కేసులతో చంద్రబాబును, లోకేశ్లను ఏమి చేయలేరన్నారు.
మరోవైపు నారా లోకేశ్ను కూడా ప్రభుత్వం అరెస్టు చేస్తే నారా బ్రాహ్మణితో యువగళం పాదయాత్ర, నారా భువనేశ్వరీతో బస్సుయాత్ర నిర్వహింపచేయాలని టీడీపీ పోలిటికల్ యాక్షన్ కమిటీ పథక రచన చేస్తోండటం ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపులకు బాటలు వేస్తుంది.