ఇటీవల లిక్కర్ స్కాం ఆరోపణలతో ఈడీ అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితకు ఎవరైనా బెయిల్ ఇస్తారా? అని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు
వరంగల్లో మద్దతునిస్తే బీఆరెస్ను 12సీట్లలో గెలిపిస్తా
విధాత : ఇటీవల లిక్కర్ స్కాం ఆరోపణలతో ఈడీ అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితకు ఎవరైనా బెయిల్ ఇస్తారా? అని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. అయితే న్యాయంగా పోరాడితే తాను బెయిల్ ఇప్పించగలనని స్పష్టం చేశారు. సీబీఐ, ఐటీ రైడ్స్ భయం ఉంటే తన దగ్గరకు రావాలని కేఏపాల్ పిలుపునిచ్చారు. మా పార్టీలో వచ్చే వారికి సీబీఐ, ఐటీ రైడ్స్ భయం ఉన్నవారిని తాను కాపాడుతానని హామీ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని, కేసీఆర్ మారాలని తాను వంద సార్లు చెప్పానని, లేదంటే నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తారని చెప్పానని, తనను గతంలో కేసీఆర్ కొట్టించారని గుర్తుచేశారు. ఆ రోజే తాను శపించానని, అందుకే మసైపోయారని విమర్శించారు.
ప్రజాశాంతి ఎంపీ అభ్యర్థి బాబు మోహన్కు వరంగల్లో కేసీఆర్ మద్దతు ఇస్తే నేను నిన్ను 12 సీట్లు మెజార్టీతో గెలిపిస్తానని కేసీఆర్కు పాల్ హామీ ఇచ్చారు. తాను పోరాడినందునే ఏపీలో మేలో ఎన్నికలు పెడుతున్నారని పాల్ చెప్పారు. ప్రజాశాంతిని గెలిపిస్తే ఏపీ ప్రభుత్వం చేసినా అప్పులన్నీతీరుస్తానని హామీ ఇచ్చారు. తనను, తన పార్టీని గెలిపిస్తే రూ. 50 లక్షల కోట్లను తీసుకొచ్చి ఏపీ అప్పుగా ఉన్న రూ.10 లక్షల కోట్లను తీరుస్తానని పేర్కొన్నారు. రూ.5లక్షల కోట్లు అప్పుచేసినా జగన్ కావాలా? అధికారికంగా రూ. 5 లక్షల కోట్లను దానం చేసిన కేఏ పాల్ కావాలా? ఏపీ ప్రజలు తేల్చుకోవాలని కోరారు. అప్పటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అదాని, అంబానీలను మిలినియర్లను చేసిందని, మోదీ వచ్చిన తరువాత వారు దేశాన్ని అమ్మేశారని ఆరోపించారు. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నానని, ఎమ్మెల్యేగా కూడా ఎస్. శృంగావరపు కోట నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నానని తెలిపారు. నా అనుచరులు పిఠాపురం నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని గత పది సంవత్సరాలుగా కేంద్రాన్ని అడుగుతున్నానని, అది సాధించేంతరకు నిద్రపోనన్నారు.