పట్టించుకోని అధికారులు, నాయకులు మంచుప్పులలో దళితుల భూమి కబ్జా ఏడాదిగా కొనసాగుతున్న నిరసనలు నేడు మంచుప్పుల టూ పాలకుర్తి పాదయాత్ర సమస్య పరిష్కారమయ్యే వరకు నిరసన విధాత,వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా మంచుప్పల గ్రామ దళిత కుటుంబాలు తమకు కేటాయించిన భూమిని కాపాడుకునేందుకు ఏడాదిగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని మంచుప్పులలో ఈ కబ్జా భాగోతం జరిగింది. […]
విధాత,వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా మంచుప్పల గ్రామ దళిత కుటుంబాలు తమకు కేటాయించిన భూమిని కాపాడుకునేందుకు ఏడాదిగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని మంచుప్పులలో ఈ కబ్జా భాగోతం జరిగింది. కబ్జా నుంచి తమ భూమిని రక్షించాలంటూ దళిత భూపోరాట కమిటీ నేతృత్వంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.
దళితులు ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ అధికార ప్రజాప్రతినిధుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు. ఏడాది కాలంగా చేపట్టిన నిరసనకు కొనసాగింపుగా మంచిప్పుల గ్రామం నుంచి పాలకుర్తి వరకు మంగళవారం పాదయాత్ర చేపట్టేందుకు దళితుల పోరాట కమిటీ కార్యాచరణకు సిద్ధమైంది.
చాలాకాలం ప్రభత్వ ఆధీనంలోనే..
దళితుల భూ పోరాటానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచుప్పుల గ్రామానికి చెందిన నెల్లుట్ల శారద 1972లో భూ గరిష్ట పరిమితి చట్టానికి లోబడి తన వద్ద ఉన్న పరిమితికి మించిన భూమిని ఆమె ప్రభుత్వానికి అప్పగించారు. మంచుప్పుల గ్రామంలోని సర్వే నెంబర్ 22 లో 16 ఎకరాల 29 కుంటల భూమి ఉంది. ఈ భూమి చాలా కాలం పాటు ప్రభుత్వం ఆధీనంలో ఉంది.
52కుటుంబాలకు పట్టాలిచ్చిన ప్రభుత్వం
1993లో స్థానిక దళితుల పోరాటం ప్రజాసంఘాల సహకారంతో సాగిన ఆందోళన ఫలితంగా ఈ భూమిలోని 4ఎకరాల 29 కుంటల భూమిని స్థానిక దళితుల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. 52 కుటుంబాలకు ఈ భూమి చెందే విధంగా అప్పట్లో ప్రభుత్వం పట్టాలిచ్చారు. ఇందులో 30 కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకంలో భాగంగా ఇల్లు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇళ్లల్లో గ్రామ దళితులు నివసిస్తున్నారు. ఇక్కడ వరకు కథ సుఖాంతంగానే సాగింది. ఆ తర్వాత భూ వ్యవహారం మలుపు తీసుకుంది.
కలిసొచ్చిన పాత యజమాని పేరు
నాలుగు ఎకరాల 29 గుంటల భూమిలో 52 కుటుంబాలకు పట్టాలి ఇచ్చి 32 మందికి ఎకరం 20 కుంటల భూమిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లా నిర్మాణం చేయగా మరో రెండున్నర ఎకరాల భూమి మిగులుగా ఉంది. రెండున్నర ఎకరాల భూమి ఖాళీగా కనిపించడంతో స్థానిక పెద్దల కన్ను ఈ భూమిపై పడింది. ఖాళీ భూమిని తమ వశం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దళితులకు కేటాయించిన భూమికి పట్టాదారుగా పాత భూయజమాని నెల్లుట్ల శారద పేరు కొనసాగడం వీరికి కలిసొచ్చింది.
చేతులు మారిన డబ్బు
ఆ పేరును ఉపయోగించుకొని ఈ భూమిని తమ పేరు పైకి మార్చుకునే విధంగా పావులు కదిపారు. ఈ వ్యవహారంలో డబ్బు కూడా చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. దళితుల్లో ఉన్న ఒకరిద్దరిని, మరో నలుగురైదురు బీసీలను తమ వైపు తిప్పుకొని వాళ్లకు కేటాయించిన పట్టాలను కొనుక్కున్నారు. కబ్జా చేయాలనుకున్న భూమిలో నలుగురికి రెండు గుంటల చొప్పున వాటా ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన భూమిని తమ పేరున మార్చుకునేందుకు పన్నిన పథకం విజయవంతం చేసుకున్నారు.
‘ధరణి’ తో పని కానిచ్చేసిన గ్రామ పెద్దలు
ఈ కబ్జాలో చక్రం తిప్పిన వీరంతా గ్రామంలో గ్రామ పంచాయతీలో ప్రజా ప్రతినిధులుగా అధికార పార్టీ నాయకులుగా చలామణిలో ఉన్నారు. తమకున్న పలుకుబడి అధికారాన్ని అవకాశంగా తీసుకొని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణిలో భాగంగా ‘రెండున్నర ఎకరాల’ ఖాళీ స్థలాన్ని తమ పేరుపై నమోదు చేసుకున్నారు. ఈ వ్యవహారం బయటికి రావడంతో తమ భూమిపై పెద్దల కన్ను పడినట్లు స్థానిక దళితులు గుర్తించారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పెద్దలు
ఈ భూమి ప్రభుత్వం 1993 లోనే తమకు కేటాయించి పట్టాలిచ్చిందని దళితులు పదేపదే విన్నవించినా పట్టించుకునే నాథులు కరువయ్యారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తమ కుటుంబాల సంఖ్య పెరిగినందున ఈ భూమిని ఇళ్ల స్థలాల కోసం తమకే కేటాయించాలని కోరారు. దళితుల ఆకాంక్ష అభిప్రాయాలను పట్టించుకోకుండా పెద్దలు ఏకపక్షంగా వ్యవహరించారు.
గుడిసెల కాల్చివేత… కేసులు నమోదు
ఈ నేపథ్యంలో దళిత కుటుంబాల్లోని ఇల్లు లేని పేదవారు తమకు కేటాయించిన భూమిలో భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏడాది క్రితం గుడిసెలు వేసుకున్నారు. తమ భూమి తమకే చెందాలని స్వాధీనానికి సిద్ధమయ్యారు. ఈ పోరాటంలో కాకర్ల రమేష్, బానాల వెంకన్న, గోల మాదయ్య, కాకర్ల సోమయ్య, కాకర్ల బిక్షం తదితరులు పాల్గొన్నారు.
దీనిపై స్పందించిన కబ్జాదారులు వేసుకున్న గుడిసెలను బలవంతంగా దాడి చేసి తొలగించి, కాలపెట్టారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలంటూ దళితులు పోలీసులను ఆశ్రయించగా పరస్పరం కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ భూ సమస్య పై కోర్టులో కేసు కొనసాగుతున్నట్లు పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. ఒకవైపు కోర్టు కేసు ద్వారా తమ ప్రయత్నం చేస్తూనే తమదైన పద్ధతుల్లో ప్రత్యక్ష ఆందోళనను కొనసాగిస్తూ వస్తున్నారు. భూమి వద్ద ఏడాదికాలంగా దీక్షలు చేస్తూ వస్తున్నారు. ఈ సమస్యను స్థానిక అధికారుల దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయినా సానుకూల స్పందనరాలేదు.
మంచుప్పుల టూ పాలకుర్తి పాదయాత్ర
తమ నిరసన దీక్షలకు మంగళవారానికి 365 రోజులు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యపై ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు మంచిప్పుల గ్రామ దళితులు గ్రామం నుండి నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా భూమిని పట్టాదారు నుంచి చట్టబద్ధంగానే కొనుగోలు చేసినట్లు భూ కబ్జా ఆరోపణలకు గురైన వ్యక్తులు చెప్పడం గమనార్హం. వీరికి అధికార పార్టీ పెద్దల మద్దతు కూడా కొనసాగుతోంది. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి, అధికారులు స్పందించి తగినచర్యలు తీసుకుంటారా లేదా అనే చర్చ సాగుతోంది.
న్యాయం జరిగే వరకు పోరాటం: కాకర్ల రమేష్, దళిత పోరాట కమిటీ అధ్యక్షుడు
గ్రామంలోని భూమిని ప్రభుత్వం 1993లో గ్రామ దళితుల ఇళ్లస్థలాల కోసం కేటాయించారు. ఈ భూమి పైన కొందరు పెద్దల కన్ను పడింది. సర్పంచ్, ఉప సర్పంచ్లు మరి కొందరి సహకారంతో ఈ భూమి కబ్జా చేశారు. ఈ గద్దల కబ్జా నుండి తమ భూమిని తమకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఏడాదిగా దళితులమంతా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నాం. 364 రోజులుగా భూమి దగ్గర దీక్షలు కొనసాగిస్తూ నిరసనను వ్యక్తం చేస్తున్నాం. మంగళవారం నాటికి 365 రోజులు పూర్తికానున్నాయి. సమస్య పరిష్కారం జరిగే వరకు ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం అధికార పార్టీ పెద్దలైన మంత్రి ఎర్రబెల్లి, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలి.