విధాత : చీటికి మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డిలు మాట్లాడుతున్న మాటలలో వాస్తవం లేదని, రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం..పదేళ్లు సీఎంగా రేవంత్రెడ్డినే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్లగొండలో మాజీ మంత్రి కె.జానారెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డిలతో కలిసి రంజాన్ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు ఎవరు లేరని, అది కేవలం బీజేపీ సృష్టి మాత్రమేనని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవని, అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. హరీష్ రావు,మహేశ్వర్ రెడ్డి లు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు.
మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డికి ఎందుకని, ముందు ఆయన బీజేపీలో బండి సంజయ్ ను ఎందుకు మార్చారో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. భట్టి విక్రమార్కకు చెక్ పెడుతున్నామంటూ హరీశ్రావు మాట్లాడుతాడని, భట్టి అంటే మా పార్టీలో అందరికి గౌరవమని, ఆయనను సీఎల్పీ లీడర్గా ఓర్వలేని బీఆరెస్ చరిత్ర మరిచిపోలేదన్నారు. అసలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్, బీజేపీలు ఒక్కో ఎంపీ సీటు గెలుచుకుంటే దేనికైన సిద్ధమన్నారు. బీజేపీ కుల,మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధిపొందాలని చూస్తుందని, దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీగా దేశ ప్రజల సమగ్రత, అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను, హామీలను అమలు చేస్తు ముందుకెలుతున్నామని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతుబంధు, రుణమాఫీ సహా ఇతర హామీలను అమలు చేస్తామన్నారు.