డిజిటల్ TSRTC: ట్రాకింగ్ సిస్టంతో కొత్త సూపర్ లగ్జరీ బస్సులు.. నేటి నుంచే
నేడు ప్రారంభించనున్న మంత్రి అజయ్ కుమార్ ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని యాజమాన్యం భావించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు […]

నేడు ప్రారంభించనున్న మంత్రి అజయ్ కుమార్
ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని యాజమాన్యం భావించింది.
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో 630 సూపర్ లగ్జరీ, 130 డిలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఈ బస్సులన్నీ మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.
ఈ క్రమంలో నేడు (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై కొన్ని కొత్త సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం జరుగనుంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, రవాణా, రహదారి మరియు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.
ట్రాకింగ్ సిస్టం.. పానిక్ బటన్!
ఇక కొత్త సూపర్ లగ్జరీ బస్సులకు అదునాతన సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు ఎమైనా ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్ను నొక్కగానే టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుంది. తద్వారా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు.
అలాగే, ప్రతి బస్సులో సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లు, ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులు ఉండనున్నాయి. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్ డీఏఎస్) ఏర్పాటు చేశారు.
బస్సులో మంటల చెలరేగితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగిన అలారం ఆటోమెటిక్గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్ డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు టీవీలను ఏర్పాటు చేస్తున్నారు.