Nirudyoga March | ఓరుగల్లు పోరుగడ్డపై.. నేడు ‘నిరుద్యోగ మార్చ్’

కేయూ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాయంత్రం భారీ ర్యాలీ భారీగా తరలించేలా బీజేపీ ప్లాన్, ప్రచారం తదుపరి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహణ హాజరుకానున్న బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనండి: మనోహర్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై భారతీయ జనతా పార్టీ శంఖం పూరించింది. పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శనివారం వరంగల్లో ‘‘నిరుద్యోగ మార్చ్’’ (Nirudyoga March) […]

  • By: Somu    latest    Apr 15, 2023 12:53 AM IST
Nirudyoga March | ఓరుగల్లు పోరుగడ్డపై.. నేడు ‘నిరుద్యోగ మార్చ్’
  • కేయూ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాయంత్రం భారీ ర్యాలీ
  • భారీగా తరలించేలా బీజేపీ ప్లాన్, ప్రచారం
  • తదుపరి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహణ
  • హాజరుకానున్న బండి సంజయ్
  • నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనండి: మనోహర్ రెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై భారతీయ జనతా పార్టీ శంఖం పూరించింది. పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శనివారం వరంగల్లో ‘‘నిరుద్యోగ మార్చ్’’ (Nirudyoga March) కు సిద్ధమైంది.

లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఐటీ శాఖ మంత్రిని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో మార్చ్ జరిపేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. దూర ప్రాంతాలు చెందిన వారు ఇప్పటికే హనుమకొండకు తరలివస్తున్నారు.

దీనిలో భాగంగా ఓరుగల్లు గడ్డపై శనివారం సాయంత్రం 4 గంటలకు ‘‘నిరుద్యోగ మార్చ్’’ పేరుతో హన్మకొండ కాకతీయ యూనివర్శిటీ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది నిరుద్యోగులతో ర్యాలీ నిర్వహించబోతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాటు పార్టీ ముఖ్య నేతలంతా ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనున్నారు.

ర్యాలీ అనంతరం బండి సంజయ్ కుమార్ నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తన సహజధోరణిలో నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో ఆ నినాదానికి ఏ విధంగా తూట్లు పొడిచిందనే విషయాన్ని లేవనెత్తనున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో సర్కార్ తీరును ప్రశ్నించనున్నారు.

ఓరుగల్లులో నిర్వహిస్తున్న ఈ నిరుద్యోగ మార్చ్ విజయవంతానికి బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ నిర్వహణ కమిటీ సభ్యులు గత మూడు రోజులుగా వరంగల్ లోనే మకాం వేసి నిరుద్యోగ మార్చ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

వర్సిటీలో నాయకుల ప్రచారం

పెద్ద ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు రూపొందించారు. వేలాది కరపత్రాలు ప్రింట్ చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని యూనివర్శిటీలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల వద్ద నిరుద్యోగులకు అందజేస్తూ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనాలని కోరారు.

మరోవైపు బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు, కళాకారులు ఆయా కేంద్రాలవద్దకు వెళ్లి నిరుద్యోగ మార్చ్ ను సక్సెస్ చేయాలంటూ ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాయకులు రావు పద్మ, విఠల్, చంద్రవదన్, ప్రేమేందర్ రెడ్డి, కరుణ గోపాల్, దరువు ఎల్లన్న తదితరు లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.

అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కాకుండా అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేయాలని, TSPSC పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లీకేజితో నష్టపోయిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ రూ.1 లక్ష నష్ట పరిహారం ఇవ్వాలని, మంత్రివర్గం నుండి కేటిఅర్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమెందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మంత్రి డా.విజయ రామారావు, జిల్లా ఇంఛార్జి డా.వి.మురళీధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, రాష్ట్ర నాయకులు కన్నెబోయిన రాజయ్య, ఏనుగుల రాకేష్ రెడ్డి, దరువు ఎల్లన్న, ఆకుల విజయ, పుల్లారావు యాదవ్, కార్పొరేటర్లు గురుమూర్తి శివ కుమార్, గుజ్జుల వసంత తదితరులు పాల్గొన్నారు.

కేయూ నాయకుల మద్దతు

కాకతీయ వర్శిటీ నాయకులు నిరుద్యోగ మార్చ్ కు సంఘీభావం తెలిపారు. కాకతీయ యూనివర్శిటీ నాయకులు ఉమాశంకర్, ప్రెసిడెంట్ ప్రేమ్ సుధాకర్ మార్చ్ కు సంపూర్ణ మద్దుతు ప్రకటించారు. ఇదిలా ఉండగా నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో హనుమకొండలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ర్యాలీ జరిగే కేయూ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

నిరుద్యోగం మార్చ్ ను విజయవంతం చేయండి: మనోహర్ రెడ్డి

ఓరుగల్లు పోరుగడ్డపై జరగబోయే నిరుద్యోగ మార్చ్ ను జయప్రదం చేయాలని నిరుద్యోగులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీ కన్వీనర్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో దగాపడ్డ ప్రజలంతా నిరుద్యోగ మార్చ్ కు సంఘీభావం తెలిపాలని కోరారు.

వరంగల్ నిరుద్యోగ మార్చ్ అనంతరం రాష్ట్రంలోని మిగిలిన ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ నిరుద్యోగ యువతను ఏకం చేసిన భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహించి కేసీఆర్ సర్కార్ ను దించేదాకా పోరాడతామని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కూడా నిరుద్యోగ మార్చ్‌ భారీ ఎత్తున నిర్వహించాలని బిజెపి అధిష్టానం యోచిస్తున్నది.