బాబుతో పొత్తు.. పవన్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకమేనా?
నాటి నుంచి.. నేటి వరకు ఒంటరిగా పోటీ చేయని టీడీపీ ఇక మిగిలిన పార్టీ YCP మాత్రమే పొత్తుతో గట్టెక్కడమే బాబు రాచమార్గం.. ఏ అస్త్రమైనా అధికారం కోసమే.. విధాత: రాజకీయాల్లో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, పొత్తులు సహజమని పవన్తో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం, కానీ 2014లో అదే పార్టీతో విభేదించినట్టు తెలిపారు. రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయి. పొత్తులపై ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు. ఎప్పుడు ఏం చేయాలన్నదానిపై […]

- నాటి నుంచి.. నేటి వరకు ఒంటరిగా పోటీ చేయని టీడీపీ
- ఇక మిగిలిన పార్టీ YCP మాత్రమే
- పొత్తుతో గట్టెక్కడమే బాబు రాచమార్గం..
- ఏ అస్త్రమైనా అధికారం కోసమే..
విధాత: రాజకీయాల్లో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, పొత్తులు సహజమని పవన్తో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం, కానీ 2014లో అదే పార్టీతో విభేదించినట్టు తెలిపారు. రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయి. పొత్తులపై ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు.
ఎప్పుడు ఏం చేయాలన్నదానిపై పార్టీలకు వ్యూహాలు ఉంటాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాబు వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి.
అయితే చంద్రబాబు సీఎంగా ఎన్నికైన నాటి నుంచి ఎన్నడూ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేదు. బీజేపీతోనో, కమ్యూనిస్టులతోనో, టీఆర్ఎస్తోనో, కాంగ్రెస్తోనో, జనసేనతోనో ఇట్లా ప్రస్తుత ఒక్క వైసీపీతో తప్పా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుది.
తాను అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని అస్త్రాలను బాబు సంధిస్తారు. తన రాజకీయ మనుగడకు ప్రమాదం ఏర్పడిన ప్రతి సందర్భంలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని గట్టెక్కడం ఆయనకు అలవాటుగా మారింది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. వైపీసీని గద్దె దించి తాను అధికారంలోకి రావాలంటే ఒంటరిగా సాధ్యం కాదని నారా వారికి బోధ పడినట్లు ఉన్నది. ఈ క్రమంలోనే ఒక్క ఎమ్మెల్యే సీటు లేని జనసేనతో పొత్తుకు పరుగులు పెడుతున్నాడు.
ఒకవైపు ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ, మరోవైపు కేంద్రంతో జగన్ సఖ్యతగా ఉండటం వంటివి బాబును కలవర పెడుతున్నాయి. అందుకే కుదిరితే కమలం పార్టీని కూడా తమతో కలుపుకోవచ్చు లేకపోతే జనసేన, వామపక్షాలతో కలిసి వైపీసీకి చెక్క్ పెట్టాలనే ఆలోచనను బాబు చేస్తున్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సన్నద్దం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనషులను వాడుకోని వదిలేయడం లోను దిట్టైన బాబు అప్పుడు జూ ఎన్టీఆర్ను ప్రచారానికి వాడుకుని ఆ తర్వాత పూర్తిగా పక్కకు పెట్టాడు.. మళ్లీ ముందస్తు ఎన్నికల ఉహాగానాల మధ్య ఇన్నాళ్లకు మరోసారి సమావేశం కానున్నాడు.
అయితే బాబు వ్యూహాలు, ఎత్తుగడలు అన్నీ ఆయన స్వలాభం కోసమే. బాబు ఏ నిర్ణయం తీసుకున్నా అది చారిత్రక అవసరంగా చాటేందుకు ప్రచార, ప్రసారమాధ్యమాలు ఉండనే ఉన్నాయి. ఎటొచ్చీ జనసేన అధినేతకే కష్టాలు వచ్చి పడుతాయి.
వైపీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం పవన్ కల్యాణ్ పార్టీకి ఉన్నది. కానీ ఆయన సొంతంగా నిలబడితే ఇవాళ కాకున్నా రేపు అయినా నిలబడుతాడు. కానీ బాబు వెంట నడిస్తే రాజకీయాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుతాడు తప్పా కథానాయకుడు కాలేడు. కనీసం కీలక పాత్రధారి కూడా కాలేడు.
BRS విస్తరణ వల్ల బాబు అండ్ కూటమికే నష్టం కలిగే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును BRS చీల్చితే అంతిమంగా అది వైసీపీకి మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బాబు గెలవడం సంగతి పక్కన పెడితే పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు మనుగడ లేకుండా చేస్తాడు.
అదే జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నిక తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల నుంచి వైదొలిగి పూర్తి స్థాయిలో సినిమాలకే పరిమితం కావాల్సి వస్తుంది అంటున్నారు. అయితే పవన్ ప్యాకేజీలో భాగమే ఇదంతా అనే వారూ ఉన్నారు. ఏది ఏమైనా బాబు ఆటలో అరటి పండు ఎవరు అవుతారన్నది ఎన్నికల తర్వాత తేలుతుంది.
ఏపీలో BRS తప్పులేదు: పవన్కల్యాణ్
బీఆర్ఎస్ ఏపీకి రావడాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదని, ఏ పార్టీలో అయినా చేరికలు సహజమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కొత్తగా ఏ పార్టీ వచ్చినా స్వాగతిస్తామన్నారు. ప్రచార వాహనం ఎవరైనా కొనుగోలు చేస్తారు. వారాహి వాహనం సొంత డబ్బులతో కొనుగోలు చేసినట్టు తెలిపారు. సొంత డబ్బులతో కొన్న వాహనంపై విమర్శలు చేస్తున్నారన్నారు.