• రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ • రైతు వేదిక నిధులపై భారీ ధర్నాలు • ధాన్యం కొనుగోళ్ళపై గతేడాది నిరసన • అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం • ప్రభుత్వాల చిత్తశుద్ధిపై అనుమానాలు విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: రెండేళ్లుగా రైతాంగం చుట్టూ బిజెపి, బీఆర్ఎస్ రాజకీయం కొనసాగుతోంది. కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ రెండుపార్టీలు రైతులను తమ రాజకీయ ప్రయోజనాలకు కేంద్రబిందువుగా చేసుకుంటున్నాయి. రెండు పక్షాలు పరస్పరం పోటీపడుతూ […]
• రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్
• రైతు వేదిక నిధులపై భారీ ధర్నాలు
• ధాన్యం కొనుగోళ్ళపై గతేడాది నిరసన
• అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం
• ప్రభుత్వాల చిత్తశుద్ధిపై అనుమానాలు
విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: రెండేళ్లుగా రైతాంగం చుట్టూ బిజెపి, బీఆర్ఎస్ రాజకీయం కొనసాగుతోంది. కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ రెండుపార్టీలు రైతులను తమ రాజకీయ ప్రయోజనాలకు కేంద్రబిందువుగా చేసుకుంటున్నాయి. రెండు పక్షాలు పరస్పరం పోటీపడుతూ విభేదాలను రక్తి కట్టిస్తున్నారు. రైతుల సమస్యల పేరుతో ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తూ ఎవరికివారు తమ ఆధిపత్యంతో పట్టును నిలుపుకునే ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీ నాయకుల నిజాయితీ పట్ల సర్వత్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైతుల సంక్షేమం, అభివృద్ధి పట్ల రెండు పార్టీల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు.
-ఉపాధి హామీ నిధులపై ధర్నాలు
తాజాగా ఉపాధి హామీ నిధులను విడుదలకు, రైతుకల్లాలకు వెచ్చించిన నిధులకు కేంద్రం లింకు పెట్టిందని విమర్శిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నాలను నిర్వహించింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాల్ పల్లి, ములుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు తీవ్రంగా కృషి చేశారు. ప్రత్యేకంగా పార్టీ పరిశీలకులను నియమించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాలకు అధికార పార్టీ పెద్ద ఎత్తున రైతులను, కేడర్ను తరలించే ప్రయత్నం చేసి తమ బలాన్ని చాటేందుకు కృషి చేశారు.
రెండేళ్లుగా రైతుల చుట్టూ రాజకీయం
ఎనిమిదేళ్ల క్రితం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. రెండో పర్యాయం కూడా అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు దఫాలలో దాదాపు 8 ఏళ్ల కాలం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఎక్కడ లేనంత సఖ్యత కొనసాగిందనే విమర్శలు విపక్షాల నుంచి అప్పట్లో వెల్లువెత్తాయి. ప్రధాని మోడీకి, సీఎం కేసీఆర్ గొంతుకగా మారి ఆయన తీసుకున్న అనేక రాజకీయ,ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలను బీజేపీ నాయకుల కంటే కేసీఆర్ బలంగా మాట్లాడుతూ మద్దతు ఇచ్చిన విషయం రాష్ట్ర ప్రజలు అప్పుడే మర్చిపోలేదు.
నోట్ల రద్దూ, జీఎస్టీ, రైతు చట్టాలకు మద్ధతు
ప్రధానంగా నోట్ల రద్దు, జీఎస్టి అమలు, తదితర తీవ్ర సమస్యలపట్ల అసెంబ్లీ సాక్షిగా మోడీని కేసీఆర్ బల్లగుద్ది బలపర్చారు. ఇక వ్యవసాయానికి సంబంధించి మూడు చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఉత్తర భారతదేశ రైతాంగం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఢిల్లీ రాజధాని ముట్టడించి సుదీర్ఘ ఆందోళనతో చరిత్ర సృష్టించిన సమయంలో కేసీఆర్ ముందుగా మూడు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
తొలిసారి కేంద్రంపై తిరుగుబాటు చేసినట్లు ప్రకటించి తన గులాబీ శ్రేణులను రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టే విధంగా చర్య తీసుకున్నారు. దీంతో అప్పట్లో కేసీఆర్ నిర్ణయంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ నిరసన జరిగిన కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి మోడీని కలిశారు. తదుపరి మూడు వ్యవసాయ చట్టాలకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించి యూటర్న్ తీసుకొని కేసీఆర్ చర్చనీయాంశంగా మారారు.
అనంతరం కొద్ది రోజులకు జరిగిన పరిణామాల్లో ఇదే కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తానంటూ సాక్షాత్తు సీఎం హోదాలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి యూటర్న్ తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
ఉత్తరభారత రైతుల ఆందోళనకు మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించి రాజకీయ, రైతాంగ వర్గాలను ఆశ్చర్యానికి లోను చేశారు. ఇలాంటి విషయాల్లో ఏమాత్రం మొహమాట పడకుండా యూటర్న్ తీసుకొని మాట్లాడడంలో కేసీఆర్ తీరేవేరని ఆయనను దగ్గరగా పరిశీలించిన వారు అంటుంటారు. ఈ సమయంలో కూడా కేసీఆర్ తన మార్కును ప్రదర్శించారని గుర్తుచేస్తుంటారు.
బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్
బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య స్నేహం మొదటి టర్మ్ పూర్తిగా, రెండో పర్యాయం రెండు సంవత్సరాల పాటు సాఫీగా సాగింది. ఒక విధంగా ఫస్ట్ టర్మ్ ముగియక ముందే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ అంతర్గతంగా సహకరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ తదుపరి టీఆర్ఎస్ నేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనపరచి అడుగు ముందుకు వేయడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పొడచూపినట్లు పరిశీలకులు భావిస్తున్నారు
– ధాన్యం కొనుగోలు పై ప్రారంభం
గతేడాది వానకాలం ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా మారిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేపట్టి బీజేపీపై మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తన బలాన్ని, బలగాలను ఈ సందర్భంగా ప్రదర్శించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అధికార పార్టీగా ఉండి కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కడమేమిటి అంటూ విపక్ష పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలు అప్పట్లో విమర్శలు చేశాయి.
ఇదే స్థాయిలో బీజేపీ కూడా ధాన్యం కొనుగోళ్ల విషయాన్ని రచ్చ రచ్చ చేస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కళ్ళాల్లో పర్యటిస్తూ టీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా కస్టమ్స్ మిల్లింగుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, కేసీఆర్ వేలకోట్లు వెనకేసుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఆ తదుపరి యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య పీటముడి పడింది.
ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందుల గురి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తే, యాసంగి వడ్ల కొనుగోలు టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుందని బాయిల్డ్ రైస్ పంపించమని హామీ ఇచ్చినట్లు బీజేపీ నేతలు ఎదురు దాడి చేసిన విషయం తెలిసిందే. రెండు పార్టీల విమర్శలు ఆందోళనతో గత వానాకాలం, యాసంగిలో రైతులు కల్లాల్లో కష్టాలు పడ్డారు. ధాన్యం కొనుగోలు జాప్యం కావడంతో అనేకమంది రైతులు కల్లాల్లో ప్రాణాలు విడిచిన విషాదకర సంఘటనలు జరిగాయి.
రైతు కల్లాల నిధులపై నిరసనలు
తాజాగా ఉపాధి హామీ నిధుల వినియోగం వ్యవహారం మరోసారి రెండు ప్రభుత్వాల మధ్య, ఇరు పార్టీల మధ్య వైషమ్యాలకు దారితీసింది. రైతు వేదికల నిర్మాణంలో భాగంగా కల్లాల నిర్మాణానికి కేటాయించిన ఉపాధి హామీ పథకం నిధులు రూ. 150 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి జమ చేస్తేనే రూ. 1100 కోట్ల ఉపాధి హామీ నిధులను విడుదల చేస్తామంటూ కేంద్రం లింకు పెట్టిందని విమర్శిస్తున్నారు. కేంద్ర ఏక పక్ష వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతాంగ ధర్నాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు అధికార పార్టీ పెద్ద ఎత్తున రైతులను, పార్టీ కేడర్ను తరలించి తమ బలాన్ని చాటారు.
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్
ఇటీవల తమ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కేసీఆర్ తమ పార్టీ విధానాలను ప్రకటిస్తూ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ ప్రకటన చేశారు. రైతాంగ సమస్యలను కేంద్రంగా దేశంలో బిజెపిని గద్దె దింపుతాం అంటూ ప్రకటించడం విశేషం. దీనికి ముందు మూడు వ్వవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన తికాయత్ లాంటి రైతాంగ నేతలతో సంబంధాలను పెంచుకునే ప్రయత్నం చేశారు.
రైతుల సుధీర్ఘ ఆందోళనలలో ప్రాణాలు కోల్పోయిన రైతన్నలకు ఆర్థిక సాయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఉత్తర భారతదేశంలో బీఆర్ఎస్ అడుగుడేందుకు రైతు సమస్యలను ఉపయోగించుకుంటున్న విషయం అర్థమవుతుంది. ఇదిలా ఉండగా అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ ఎనిమిది ఏళ్ల కాలంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి, గిట్టుబాటు ధర, ఆర్థిక సమస్యలకు, ఆత్మహత్యలకు పరిష్కారం ఏ మేరకు చూపెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.