పాకిస్థాన్ లోని అతిపెద్ద మైనారిటీ వర్గమైన హిందువుల ఆలయాల కూల్చివేత పరంపర కొనసాగుతోంది.
విధాత: పాకిస్థాన్ (Pakistan) లోని అతిపెద్ద మైనారిటీ వర్గమైన హిందువుల ఆలయాల కూల్చివేత (Temple Demolition) పరంపర కొనసాగుతోంది. తాజాగా సింధ్ ప్రావిన్సులోని మిథి అనే నగరంలో ప్రఖ్యాతి చెందిన హింగలాజ్ మాత ఆలయాన్ని ప్రభుత్వ అధికారులు నేలమట్టం చేశారు. జిల్లా కోర్టు ఆదేశాల మేరకే ఈ పనులు చేపడుతున్నామని అధికారులు మీడియాకు వెల్లడించారు.
ఇదే కాకుండా వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రఖ్యాత శారదా మాత ఆలయంలోని కొంత భాగాన్ని కూడా ప్రభుత్వం కూల్చివేసిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ రెండు వ్యవహారాలపై సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ అధికారులు వాటిని ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టడం అక్కడి హిందువుల పరిస్థితికి అద్దం పడుతోంది.
హింగలాజ్ మాత ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన కాఫీ షాప్నకు దారి ఏర్పాటు చేయడానికే ఆలయాన్ని కూల్చివేసినట్లు స్థానిక హిందువులు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆలయాల కూల్చివేత ఘటనలు పాక్లో పెరిగినట్లు వివిధ పత్రికా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది జులైలో.. నిర్మాణం శిథిలావస్థకు చేరిందని పేర్కొంటూ ఒక ఆలయాన్ని కూల్చేశారు.
కరాచీలోని మారీ మాతా ఆలయాన్ని భారీ బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంపై భూకబ్జాదారుల కన్నుపడింది. ఎంతో విలువ ఉన్న ఈ స్థలం కోసమే ఈ పనిచేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. హిందూ జనాభా అధికంగా ఉండే సింధ్ ప్రావిన్సులోని కరాచీలో పదుల సంఖ్యలో పురాతన ఆలయాలు ఉంటాయి