ప్రయాణికుల రద్దీ.. పది ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక రైళ్లను డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది

విధాత: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక రైళ్లను డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు ఈ నెల 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉండనున్నది. తిరుపతి-సికింద్రాబాద్ (07481) ట్రైన్ ఈ నెల 3 నుంచి 31 వరకు ప్రతి ఆదివారం పరుగులు తీయనున్నది. హైదరాబాద్-నర్సాపూర్ (07631) రైలు ఈ నెల 2 నుంచి 30 వరకు ప్రతి శనివారం నడువనున్నది.
నర్సాపూర్-హైదరాబాద్ (07632) ట్రైన్ ఈ నెల 3 నుంచి 31 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉండనున్నది. కాకినాడ-లింగంపల్లి (07445) రైలు డిసెంబర్ ఒకటి నుంచి 29 వరకు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది. లింగంపల్లి-కాకినాడ (07446) ట్రైన్ ఈ నెల 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం, గురువారం, శనివారాల్లో పరుగులు తీయనున్నట్లు పేర్కొంది. డిసెంబర్ ఒకటి నుంచి 29 వరకు తిరుపతి – అకోల (07605) రైలు ప్రతి శుక్రవారం నడువనున్నది.
అకోలా – తిరుపతి (07606) రైలు ఈ నెల 3 నుంచి 30 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. పూర్ణ – తిరుపతి (07609) రైలు ఈ నెల 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం పరుగులు తీయనుండగా.. తిరుపతి – పూర్ణ (07610) రైలు ఈ నెల 5 నుంచి 26 వరకు మంగళవారం నడువనున్నట్లు రైల్వేశాఖ వివరించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆయా ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు తెలిపింది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.