Revanth Reddy | దశాబ్ది ఉత్సవాలు కాదు.. దశాబ్ది దగా: రేవంత్‌రెడ్డి

Revanth Reddy | ప్రజల్లోకి బీఆర్‌ఎస్‌ మోసాలు ఈనెల22న అన్ని నియోజక వర్గాల్లో నిరసన ర్యాలీలు 10 రోజుల్లో అన్ని మండల కమిటీలు ఖమ్మంలో భారీ బహిరంగ సభ భట్టితో సంప్రదించి ఏర్పాట్లు చేరికలపై ఊహాగానాలు వద్దు- చర్చల దశలోనే ఉన్నాయి కేసీఆర్‌ సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్న బీజేపీ 10ఏళ్లైనా 600 మంది అమరులను గుర్తించని సర్కారు పీఏసీ సమావేశ వివరాలు వెల్లడించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విధాత: ‘‘దశాబ్ది ఉత్సవాలు కాదు…. దశాబ్ది దగా’’ పేరుతో […]

  • By: krs    latest    Jun 17, 2023 1:26 AM IST
Revanth Reddy | దశాబ్ది ఉత్సవాలు కాదు.. దశాబ్ది దగా: రేవంత్‌రెడ్డి

Revanth Reddy |

  • ప్రజల్లోకి బీఆర్‌ఎస్‌ మోసాలు
  • ఈనెల22న అన్ని నియోజక వర్గాల్లో నిరసన ర్యాలీలు
  • 10 రోజుల్లో అన్ని మండల కమిటీలు
  • ఖమ్మంలో భారీ బహిరంగ సభ
  • భట్టితో సంప్రదించి ఏర్పాట్లు
  • చేరికలపై ఊహాగానాలు వద్దు- చర్చల దశలోనే ఉన్నాయి
  • కేసీఆర్‌ సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్న బీజేపీ
  • 10ఏళ్లైనా 600 మంది అమరులను గుర్తించని సర్కారు
  • పీఏసీ సమావేశ వివరాలు వెల్లడించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

విధాత: ‘‘దశాబ్ది ఉత్సవాలు కాదు…. దశాబ్ది దగా’’ పేరుతో పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను, బీఆర్‌ఎస్‌ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళతామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 22 న 119 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు తీయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఈ నిరసన ర్యాలీలో రావణాసురుడి రూపంలో ఉన్న కేసీఆర్ పది వైఫల్యాలతో కూడిన దిష్టిబొమ్మ దగ్ధం చేయాలన్నారు.

ఆర్డీఓ కార్యాలయాలు లేదా ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించాలని తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ(పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశం వివరాలను రేవంత్‌ మీడియాకు తెలియజేస్తూ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా షబ్బీర్ అలీ గారు బాధ్యత వహిస్తారన్నారు.

దశాబ్ది ఉత్సవాలు బీఆర్‌ఎస్‌ సొంత వ్యవహారంలా చేస్తోందన్నారు. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారిందని, దీన్ని ఖండించాన్నారు. ఈ కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిపోయిందని, పరిపాలన వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు. గ్రామస్థాయి నుంచి అందరు అధికారులు బీఆర్‌ఎస్‌ సేవలో మునిగిపోయారని ఆరోపించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. కేజీ టూ పేజీ, ఫీజు రీయింబర్స్ మెంట్ , నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్ హామీల అమలు ఊసే లేదన్నారు.

ఖమ్మంలో భట్టి పాదయాత్ర ముగింపు సభ

సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ఈ నెలాఖరులో ముగుస్తుందని రేవంత్‌ తెలిపారు. ఖమ్మంలో జాతీయ నాయకులతో ఒక భారీ ముగింపు సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని, భట్టితో సంప్రదించి ముగింపు సభ నిర్వహించాలనుకుంటున్నామన్నారు. మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయని, 10రోజుల్లో అన్ని మండల కమిటీలు పూర్తి చేస్తామన్నారు. బీసీ , మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ ల పై చర్చ జరుగుతోందని రేవంత్‌ వెల్లడించారు.

బీసీలలో ఉన్న అన్ని కులాలకు లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చేరికలపై ఊహాగానాలు వద్దని రేవంత్‌ తెలిపారు. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక మేమే అధికారికంగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలోలా… కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో మీడియా కూడా భాగస్వామి కావాలని రేవంత్‌ కోరారు.

10 ఏళ్లైనా 600 మంది అమరులను గుర్తించలేదు

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ అవమానించారని రేవంత్‌ ఆరోపించారు. పదేళ్లు పూర్తయినా 600 మంది అమరులను కూడా గుర్తించలేకపోయారన్నారు. కేటీఆర్ పరిపక్వతలేని, బాధ్యత లేని మంత్రి అని ఆరోపించారు. అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని, అందుకే తమ కార్యాచరణ అని తెలిపారు. బీ.నర్సింగరావు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని రేవంత్‌ అన్నారు.

అలాంటాయనకు ప్రభుత్వ పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. కేటీఆర్ సినిమా ఇండస్ట్రీలో ఎవరివైపు ఉంటారో అందరికీ తెలిసిందేనన్నారు. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్ కు లేదన్నారు. ఇప్పటికైనా వారిని గౌరవించి అపాయింట్ మెంట్ ఇవ్వాలన్నారు.

సీఎం కేసీఆర్‌ కొనసాగాలని కోరుకుంటున్న బీజేపీ

బీజేపీ నేతలు పథకాలు కొనసాగిస్తామని చెప్పడం కేసీఆర్ ను సీఎం గా కొనసాగాలని కోరుకుంటునట్టేనని రేవంత్‌ వ్యాఖ్యానించారు. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ఉండాలని వారు కోరుకుంటున్నారన్నారు. వాళ్లిద్దరూ ఒక్కటే అని తాము ముందునుంచీ చెబుతున్నామన్నారు. రెండవ రాజధానిపై ప్రతిపాదన వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌ తెలిపారు. ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళుతుందా? రాష్ట్రానికి వెళుతుందా తెలియాలన్నారు. విస్తృతంగా చర్చించిన తరువాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నారు.