Three children died విధాత: ఓ ముగ్గురు చిన్నారులు కారులో ఆడుకుంటుండగా ఆటోమేటిక్గా లాక్ పడిపోయింది. దీంతో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నాగ్పూర్లోని పచ్పోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు తౌఫిఖ్ ఫిరోజ్ ఖాన్(4), ఆలియా ఫిరోజ్ ఖాన్(6), ఆఫ్రిన్ ఇర్షద్ ఖాన్(6) శనివారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో సమీపంలో ఉన్న గ్రౌండ్లో కూడా […]
Three children died
విధాత: ఓ ముగ్గురు చిన్నారులు కారులో ఆడుకుంటుండగా ఆటోమేటిక్గా లాక్ పడిపోయింది. దీంతో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగ్పూర్లోని పచ్పోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు తౌఫిఖ్ ఫిరోజ్ ఖాన్(4), ఆలియా ఫిరోజ్ ఖాన్(6), ఆఫ్రిన్ ఇర్షద్ ఖాన్(6) శనివారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో సమీపంలో ఉన్న గ్రౌండ్లో కూడా వెతికారు. ఆచూకీ లభించలేదు. రాత్రి అవుతున్నప్పటికీ పిల్లలు ఇంటికి తిరిగి రాకపోయేసరికి, ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పిల్లల ఆచూకీ కోసం గాలించారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా పిల్లల ఆచూకీ లభించలేదు. అయితే నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న ఓ కారులో పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వెంటనే కారు డోరు తెరిచి చూడగా, ఆ ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. పిల్లల ఆడుకుంటుండగా కారు లాక్ కావడంతో.. ఊపిరాడక మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కారు చిన్నారుల ఇంటికి 50 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. అయితే తౌఫిక్, ఆలియా తోబుట్టువులని, ఆఫ్రిన్ వారి స్నేహితురాలని పోలీసులు తెలిపారు.