విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో వారసత్వ రాజకీయాల దూకుడు ఆసక్తి రేపుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్లలో కొత్త తరం రాజకీయ నాయకత్వం.. సీనియర్ నాయకుల వారసుల రూపంలో తెరపైకి దూసుకొస్తుంది. దీంతో రానున్న ఎన్నికల పోరులో ప్రధాన పార్టీల నుంచి కొత్త ముఖాలు ప్రజల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. వారసత్వ రాజకీయ పరంపరలో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగే వారు కొందరైతే.. మరికొందరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గాలలో హల్చల్ […]
విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో వారసత్వ రాజకీయాల దూకుడు ఆసక్తి రేపుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్లలో కొత్త తరం రాజకీయ నాయకత్వం.. సీనియర్ నాయకుల వారసుల రూపంలో తెరపైకి దూసుకొస్తుంది. దీంతో రానున్న ఎన్నికల పోరులో ప్రధాన పార్టీల నుంచి కొత్త ముఖాలు ప్రజల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
వారసత్వ రాజకీయ పరంపరలో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగే వారు కొందరైతే.. మరికొందరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గాలలో హల్చల్ చేస్తూ రాజకీయ రంగ ప్రవేశానికి ఉవ్విళ్లూరుతున్నారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా వచ్చే ఎన్నికల్లో తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని రంగంలోకి దించేందుకు సంసిద్ధమయ్యారు.
స్వయంగా అమిత్ రెడ్డి కూడా రాజకీయ రంగ ప్రవేశానికి ఆసక్తి చూపుతూ ఇప్పటికే గుత్తా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తనయుడు అమిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో జనరల్ స్థానాల నుండి తగిన స్థానం సిద్ధం చేసేందుకు సుఖేందర్ రెడ్డి ఇప్పటినుండే తెరవెనుక ప్రయత్నాలు ఆరంభించారు.
అమిత్ కోసం నల్గొండ, మునుగోడు మిర్యాలగూడ స్థానాలపై కన్నేసిన సుఖేందర్ రెడ్డి వాటిలో ఏదైనా ఒక స్థానం నుండి తనయుడు అమిత్ రెడ్డిని ఎన్నికల బరిలోకి దించాలని ఆశిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లని ఇటీవల చేసిన ప్రకటన కొత్త ఆశావహులను నిరాశ పరుస్తుంది. అయితే ఎన్నికలనాటి పరిస్థితుల్లో ఏమైనా జరగవచ్చన్న ఆశతో ఆయా నియోజకవర్గాలపై గుత్తా రాజకీయ పట్టును పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రస్తుతం అమిత్ రెడ్డి చేస్తున్న స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలన్నీ నల్గొండ అసెంబ్లీ పరిధిలోని సాగుతుండటంతో సహజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలో అసహనాన్ని రగిలిస్తుంది. ఇప్పటికే భూపాల్ రెడ్డికి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో పిల్లి రామరాజు వంటి ప్రధాన అనుచరుడి వంటి వారితో పాటు, గత ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశించి భంగపడిన జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, చాడా కిషన్ రెడ్డి వంటి వారు కూడా మరోసారి టికెట్ రేసులో పోటీగా ఉండనున్నారు. ఇప్పుడు వారికి తోడు గుత్తా అమిత్ రెడ్డి ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ టికెట్ సాధనలో కంచర్లకు పోటీగా కొత్త సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తుంది.
మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ నుంచి ఇప్పటికే దివంగత నేత మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ రెబల్గా ఒకసారి, ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకుని ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇదే రీతిలో నాగార్జునసాగర్ ఎన్నికల్లో దివంగత టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ పోటీ చేసే ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
భువనగిరి నుండి మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవ రెడ్డి తనయుడు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి రానున్న ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కు సందీప్ రెడ్డి టికెట్ రేసులో ఉండటం పక్కలో బల్లెంలా ఉంది. కాంగ్రెస్ నుండి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, కే. జానారెడ్డి తన కుమారులు కే, రఘువీరారెడ్డి, జయవీర్ రెడ్డిలలో ఒకరిని మిర్యాలగూడ లేదా నాగార్జునసాగర్లో బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి అవకాశం దక్కకపోతే బీజేపీ నుంచైనా వారిలో ఒకరు పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.
మరోవైపు మిర్యాలగూడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు కుమారుడు నల్లమోతు సిద్ధార్థ సైతం స్వచ్ఛంద కార్యక్రమాల్లో సందడి చేస్తూ ముందస్తు రాజకీయ సన్నాహాలు సాగిస్తున్నారు. మరో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కుదిరితే సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి, లేదంటే భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నారు.
రాజకీయాల్లో అవకాశాల కోసం ముందస్తుగా సందడి చేస్తున్న సీనియర్ నాయకుల వారసులకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వారిపై బీజేపీ పార్టీ నాయకత్వం సైతం ఫోకస్ పెట్టడంతో రానున్న ఎన్నికలు రాజకీయాల్లో టికెట్ల పర్వంను… పార్టీ రాజకీయ సమీకరణలను మరింత రసకందాయంగా మార్చడం తధ్యంగా కనిపిస్తుంది.