మెజార్టీ వాటాదారులదే నిర్ణయాధికారం తెలంగాణలో రూ.10వేల కోట్లతో అభివద్ది రామగుండం ఖర్మాగారం జాతికి అంకితం కొత్త ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ 8 ఏళ్లలో మౌలిక సదుపాయాలకే అధిక ప్రాధాన్యమిచ్చాం తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ విధాత, హైదరాబాద్: సింగరేణిని ప్రైవేటీకరించమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం కాగా, రాష్ట్రం వాటా 51శాతమని అన్నారు. సింగరేణిలో మెజార్టీ వాటాదారులదే […]
విధాత, హైదరాబాద్: సింగరేణిని ప్రైవేటీకరించమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం కాగా, రాష్ట్రం వాటా 51శాతమని అన్నారు. సింగరేణిలో మెజార్టీ వాటాదారులదే ప్రైవేటీకరణ నిర్ణయాధికారమని అన్నారు. తెలంగాణలో పలు అభిమానుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలలో భాగంగా శనివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రామగుండం వచ్చిన మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్కుమార్ స్వాగతం పలికారు.
PM Shri @narendramodi launches various development works in Ramagundam, Telangana. https://t.co/SanvxDdvuf
— BJP (@BJP4India) November 12, 2022
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ హైదరాబాద్లో ఈ రోజు కొంతమందికి నిద్ర కూడా పట్టదని వ్యంగ్యాస్థాలు సంధించారు. సింగరేణిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని అన్నారు. మెజార్టీ వాటాదారుల నిర్ణయం మేరకు సంస్థ ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 10వేల కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నదన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో రూ. 6,300 కోట్లతో నిర్మాణం చేసిన ఎరువుల కర్మాగారాన్ని సందర్శించి ఖర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం డిజిటల్ విధానంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. రూ.2,268 కోట్లతో నిర్మించ తలపెట్టిన 3 జాతీయ రహదారుల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
మెదక్ సిద్దిపేట -ఎల్కతుర్తి, బోధన్-బాసర -బైంసా, సిరొంచా- మహదేవ్పూర్ హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్ను ప్రారంభించారు. ఆర్ఎఫ్సీఎల్లో ఎరువుల ఉత్పత్తిని పరిశీలించారు.
అనంతరం రామగుండం ఎన్టీపీసీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వేలైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. కొత్త ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించిందని, 8 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని తెలిపారు. అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచామని తెలిపారు. మేమ శంకుస్థాపనలకే పరిమతం కాలేదని, వాటిని వేగంగా పూర్తి చేసి చూపించామన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి 2016లో శంకుస్థాపన చేశామన్నారు. భవిష్యత్తులో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందన్నారు.
రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టామని, యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. తక్కువ ధరకే రైతులకు నీమ్ కోటింగ్ యూరియాను అందిస్తున్నామన్నారు. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తు.. నేల స్వభావాన్ని బట్టి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. 5 ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తామన్నారు.
నానో యూరియా టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తెచ్చామని, 2014కు ముందు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవారని, మేము అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చేశామన్నారు. మేము తీసుకున్న చర్యలతో యూరియా నల్లబజార్ మార్కెట్ బంద్ అయ్యిందని ప్రధాని తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. యూరియా మీద కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ ఇస్తున్నదని, కేంద్రం ధాన్యం కొనటం లేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ధాన్యం ధరను మోడీ ప్రభుత్వం రూ.2 వేలకు పైగా పెంచిందన్నారు. రూ. 26 వేల కోట్లు వెచ్చించి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. 2014 నాటికి కేంద్రం 24 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందన్నారు. ప్రస్తుతం కేంద్రం 142 లక్షల కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నదని వెల్లడించారు.
కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోనే వేస్తున్నామని స్పష్టం చేశారు. 2014 నాటికి రాష్ట్రంలో 2,500 కి.మీ. మాత్రమే జాతీయ రహదారులు ఉండేవి. నేడు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణం దాదాపు 5 వేల కిలోమీటర్లకు చేరుకున్నదని అన్నారు. రామగుండంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఒక్క రామగుండంలోనే కేంద్రం రూ. 4 వేలు ఖర్చు చేస్తున్నదని. సింగరేణి ప్రైవేట్పరం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సింగరేణిలో అత్యధిక వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. గ్రామాల్లో రోడ్ల పారిశుద్ధ్యానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నదని. ఈ 8 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి వివరిస్తామన్నారు.