ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదారణను చూసి భారతీయ జనతా పార్టీ పదేపదే ఆరోపణలు చేస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ : ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదారణను చూసి భారతీయ జనతా పార్టీ పదేపదే ఆరోపణలు చేస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మీడియాతో మాట్లాడారు.
ఏదైతే చెబుతామో అది కచ్చితంగా చేసి చూపిస్తాం. రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తాం. ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశాం అని ఖర్గే స్పష్టం చేశారు. హైదారాబాద్ను బీజేపీ నిర్లక్ష్యం చేసింది. హైదారాబాద్, బెంగళూర్, ముంబైకు రావాల్సిన పెట్టుబడిదారులను బెదిరించి గుజరాత్కు తరలించారు అని ఖర్గే తెలిపారు.
అధిక విడతల్లో ఎన్నికల నిర్వహణ ఎవరకీ ఉపయోగం లేదు. ఎన్నికల కమిషన్ విధానాల మేరకు అందరూ నడుచుకోవాలి. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుని బీజేపీ ఓట్లు అడగదు. కాంగ్రెస్పై నిందలు మోపడం ద్వారా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ తమకు పోటీయే కాదంటూ పదేపదే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్కు భయపడుతున్నందునే పదేపదే ఆరోపణలు చేస్తున్నారు అని ఖర్గే మండిపడ్డారు.
నల్లధనం వెలికితీస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారు. నల్లధనం ప్రయోజనాలు తన మిత్రులకే అందజేశారు. ఎన్నికల ప్రకటన తర్వాత అదానీ, అంబానీ గురించే మాట్లాడలేదంటున్నారు. టెంపోల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు ముడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో మీరు ఎప్పుడు చూశారు. టెంపోల్లో డబ్బులు తరలిస్తుంటే ఐటీ, కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి. అదానీ, అంబానీ నుంచి డబ్బులు వెళ్తుంటే వారి ఇళ్లలో సోదాలు చేయండి. అదానీ, అంబానీ ఇళ్లలో ఈడీ, ఐటీ సిబ్బందితో తనిఖీలు చేయించండి. అంబానీ, అదానీలకు పబ్లిక్ సెక్టార్లను పంచి పెట్టాడు అని ఖర్గే ఆరోపించారు.
మోదీ కేవలం మంగళ సూత్రాలు, ముస్లిం రిజర్వేషన్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. హిందువుల ఆస్తులు ముస్లింలకు ఎలా పంచుతారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని మోడీ చూస్తున్నారు. అంబానీ, అదానీ కోసం బీజేపీ పని చేస్తుంది. మోదీ ప్రధాని స్థాయిలో మాట్లాడడం లేదు. చిల్లర మాటలు మాట్లాడటం ప్రధాని స్థాయికి తగదు మోడీ పదేండ్లలో చేసిన అభివృద్ధి మీద చర్చ చేయడం లేదు. మోదీ పేద ప్రజల కోసం పని చేయడం లేదని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియా కూటమి అదికారంలోకి రావడంతోనే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాము. ఇండియా కూటమి అధికారంలోకి రావడంతోనే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తాం. ఇండియా కూటమి అధికారంలోకి రావడంతోనే దేశ వ్యాప్తంగా కుల గణన చేపడుతాము. ఐఎఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఎస్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తక్కువగా ఉన్నారు.
పువ్వులు పొద్దున పూస్తాయి.. సాయంత్రం వాడిపోతాయని కమలం పువ్వుని ఉద్దేశించి ఖర్గే విమర్శించారు. మోదీ అబద్ధాలు చెపుతున్నాడు. ఇందిరా గాంధీ భూ సంస్కరణలు, బ్యాంకులను జాతీయం చేసింది. ప్రజ్వల్ రేవన్నపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ రిపోర్ట్ వచ్చిన తరువాత అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బీజేపీ వాళ్ళు నిరాశతో మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 5 ఏండ్లు ఉంటుంది. ఖర్గే అల్లుడిపై వచ్చిన 500 కోట్ల ఆరోపణలపై స్పందిస్తూ విచారణ చేసుకుని దోషిగా తెలితే శిక్ష వేయండి అని ఖర్గే స్పష్టం చేశారు.
హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్టు దేశానికి హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయొచ్చు కదా అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.
దేశ రక్షణ విషయంలో దేశానికి హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయాలన్న మాట వాస్తవమే. కానీ కేంద్ర ప్రభుత్వం స్థాయిలో తీసుకునే నిర్ణయం. ఆ విషయంలో తాను ఇరుకున పడదలచుకోలేదు. తాను ఢిల్లీ వెళ్లాలంటే హైదరాబాద్ నుంచే వెళ్లాలి. కాబట్టి నాకు హైదరాబాద్ అయినా పర్వాలేదు.. ఢిల్లీ అయినా ఓకే. హైదరాబాద్ రెండో రాజధాని అయితే సంతోషిస్తాను. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి. హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు తీసుకువస్తాం, హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం అని ఖర్గే స్పష్టం చేశారు.