అయోధ్య బాల రాముడి దర్శన సమయాలు మారుస్తూ జిల్లా యంత్రాంగం, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకున్నాయి
Ayodhya | అయోధ్య బాల రాముడి దర్శన సమయాలు మారుస్తూ జిల్లా యంత్రాంగం, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం విపరీతంగా భక్తులు వస్తుండడంతో దర్శనాల సమయాన్ని పొడిగించారు. ఇకపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. హారతి, భోగ్ సమయంలో కొంత సేపు భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత మళ్లీ యథావిధిగా దర్శనాలు కల్పించనున్నారు.
ఇదిలా ఉండగా.. అయోధ్యను మంగళవారం సాయంత్రం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆకస్మికంగా పరిశీలించారు. మొదట ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తుల భద్రత, సౌకర్యం, సౌకర్యాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం శ్రీరామజన్మభూమి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దర్శనానికి వస్తున్న భారీ జనసందోహం నిర్వహణ, దర్శనాలు, పూజలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆలయ ట్రస్టు ప్రతినిధులతో చర్చించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు సహనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ.. అయోధ్యలో భారీగా తరలివచ్చిన వారంతా రామ్లల్లా దర్శనం కోసం సహనంగా ఉండాలన్నారు.
అయితే, విపరీతమైన రద్దీ అసౌకర్యం కలుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, స్థానిక పోలీసులు, అధికారులకు సహకరించాలని కోరారు. ప్రతి రామభక్తునికి సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారన్నారు.
శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామ్లల్లా సోమవారం ఆలయంలో కొలువుదీరారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మంగళవారం తెల్లవారుజామునే లక్షలాది మంది దర్శనం కోసం బారులు తీరారు. ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా అయోధ్య వీధుల్లో బారులు తీరారు. ధర్మపథ్, రామ్పథ్, శ్రీ రామజన్మభూమి మార్గాల్లో భక్తులు పోటెత్తారు. రద్దీ కారణంగా గంట ముందే రాంలాలా తలుపులు తెరుచుకున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఏటీఎస్, ఆర్ఏఎఫ్ కమాండోలు భద్రత కోసం మోహరించారు. మరో వైపు సీఎం ఆదేశాలతో శాంతిభద్రతలు, ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు. భక్తుల సులభ, సురక్షితమైన దర్శనం కోసం అయోధ్య పోలీసులు అన్ని డ్యూటీ పాయింట్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. జిల్లాలోకి వచ్చే అన్ని అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను జిల్లాలోని అన్ని అంతర్ జిల్లా సరిహద్దులు, చెక్పాయింట్ల భద్రతా బలగాలు తనిఖీ చేస్తున్నాయి. అలాగే అన్ని ముఖ్యమైన ప్రదేశాలు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను సోదా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లు రాకుండా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. నగరంలో పరిశుభ్రత కొనసాగించాలని, ప్రజలకు అవసరమైన సమాచారం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.