ఉత్తరప్రదేశ్లోని మధురలో యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం జరిగింది. బస్సు కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.
డివైడర్, కారును ఢీకొట్టిన బస్సు
రెండు వాహనాలకు మంటలు
ఉత్తరప్రదేశ్లోని యమునా
ఎక్స్ప్రెస్ హైవేపై ఘటన
విధాత: ఉత్తరప్రదేశ్లోని మధురలో యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం జరిగింది. బస్సు కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. బస్సు టైరు పగడంతో అదుపుతప్పి తొలుత డివైడర్ను, తర్వాత కారును కూడా బస్సు ఢీకొట్టింది. మధురలోని మహావన్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు చనిపోయారు.
బస్సు ఆగ్రా నుంచి నోయిడా వెళ్తుండగా, మహావన్ వద్ద బస్సు టైరు పగిలిపోయింది. దాంతో బస్సు అదుపుతప్పి తొలుత డివైడర్ను తర్వాత కారును వేగంగా డీకొట్టింది. తర్వాత రెండు వాహనాలకు మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది బృందాన్ని రప్పించారు. బస్సులోని ప్రయాణికులు తప్పించుకోగలిగారు. కానీ, ఐదుగురు కారులో ఉన్నవారు కాలిపోయి మరణించారని సీనియర్ పోలీసు అధికారి సోమవారం వెల్లడించారు.
“బస్సు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది” అని మధుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ పాండే తెలిపారు. బాధితుల్లో ఒకరిని గుర్తించామని, ఇతర ప్రయాణికులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. మృతదేహాలను దవాఖానకు తరలించామని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు.