రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా కూటమి కట్టుబడి ఉన్నదని, మెరుగైన భవితవ్యం కోసం కాంగ్రెస్కు ఓటు వేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా విమర్శలు
రాజ్యంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఇండియా కూటమి
వీడియో సందేశం విడుదల
న్యూఢిల్లీ : రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా కూటమి కట్టుబడి ఉన్నదని, మెరుగైన భవితవ్యం కోసం కాంగ్రెస్కు ఓటు వేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో వినాశకర వాతావరణాన్ని సృష్టించారంటూ ప్రధాని మోదీ, అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని సోనియాగాంధీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న పలు సమస్యలను తన సందేశంలో సోనియా ప్రస్తావించారు. ఈ రోజు దేశం నలుమూలలా యువత నిరుద్యోగ సమస్యలను ఎదుర్కొంటున్నది.
మహిళలు దాష్టీకాలకు గురవుతున్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడినవర్గాలు, మైనార్టీలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు’ అని సోనియా చెప్పారు. ప్రధాని మోదీ, బీజేపీ ఉద్దేశాల కారణంగానే ఇటువంటి వాతావరణం దేశంలో నెలకొన్నదన్నారు. వారి రాజకీయ లబ్ధికోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని బీజేపీ, మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అందరి ప్రగతికోసం, అణగారిన వర్గాలకు న్యాయం కోసం పోరాడిందని సోనియాగాంధీ చెప్పారు.
తమ పార్టీ మ్యానిఫెస్టో ‘న్యాయ్పత్ర’ దారిద్ర్యంలో ఉన్నవారిని, యువత, మహిళల సమున్నత స్థితికి తీసుకెళుతుందని చెప్పారు. మరోసారి కాంగ్రెస్కు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ‘కాంగ్రెస్, ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలు దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరరక్షించేందుకు అంకితమయ్యాయి. బంగారు భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేయండి. అందరం కలి బలమైన, ఐక్య భారతదేశాన్ని నిర్మించుకుందాం’ అని సోనియా పిలుపునిచ్చారు.