జాబులు లేని జాబ్ క్యాలెండర్ ఎందుకు ?
2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తామన్న హమీ ఏమైంది?కనీసం 50 వేల పోస్ట్ ల భర్తీ కి సవరణ చేసి క్యాలెండర్ విడుదలు చేయాలిఅందులో 50 శాతం పోస్ట్ లను రోస్టర్ పాటించి.. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లకు న్యాయం చేయాలి. వలిగడ్ల రెడ్డప్ప , బిసి జెఎసి జాతీయ కన్వీనర్ డిమాండ్ విధాత:అధికారంలోకి రాగానే ఖాళీగా వున్న 2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డి […]

2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తామన్న హమీ ఏమైంది?
కనీసం 50 వేల పోస్ట్ ల భర్తీ కి సవరణ చేసి క్యాలెండర్ విడుదలు చేయాలి
అందులో 50 శాతం పోస్ట్ లను రోస్టర్ పాటించి.. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లకు న్యాయం చేయాలి.
- వలిగడ్ల రెడ్డప్ప , బిసి జెఎసి జాతీయ కన్వీనర్ డిమాండ్
విధాత:అధికారంలోకి రాగానే ఖాళీగా వున్న 2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డి జాబులు లేని జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని బీసీ జేఏసీ జాతీయ కన్వీనర్ వల్లిగట్ల రెడ్డెప్ప విమర్శించారు. గత 18 నెలలుగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదరు చూస్తూంటే వారి నోళ్లల్లో ఆయన మట్టి కొట్టారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులలో తీవ్రమైన నిరాశ, ఆందోళన వ్యక్తమౌతున్నా జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం ఆయన నైజాన్ని గుర్తుకు చేస్తోందన్నారు. ఈ మేరకు శనివారం రెడ్డప్ప పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర విభజన (2014) తరువాత ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం భారీగా పెరిగిందని, విభజన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ప్రైవేట్ రంగంలోనైనా కొన్ని పరిశ్రమలు వచ్చేవన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పారిశ్రామికీకరణ లేక, ఐ.టి పరిశ్రమలు లేక లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై ఎదురు చూసే పరిస్థితి ఏర్పడిందని బీసీ నేత రెడ్డప్ప ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 సంవత్సరాలుగా వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారని. కానీ ఉద్యోగాల భర్తీ మాత్రం జరగలేదన్నారు. ఉదాహర ణకు 2014-21 మధ్య ఏడేళ్ళ కాలంలో ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తి చేసే డిఎస్సి-2018లో 7 వేల పోస్టులతో ఒకసారి మాత్రమే నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా 10,143 పోస్టులు భర్తీ చేస్తామనిముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్లో ప్రకటించారని, లక్షలాది మంది నిరుద్యోగులకు ఇవి ఏం సరిపోతాయని రెడ్డెప్ప ప్రశ్నించారు.
జాబ్ క్యాలెండర్ 10,143 పోస్టులలో 76 శాతం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధిం చినవేనని. వైద్య ఆరోగ్యశాఖలో కూడా నర్సుల పోస్టులు భర్తీ కావాల్సి వుండగా 441కే పరిమితం చేశారని తెలిపారు.
గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో వేలాది మంది పేద, గ్రామీణ అభ్యర్థులు గ్రూప్2, పోలీస్ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటూ వేలాది రూపాయలు ఖర్చు చేశారని, నిరుద్యోగుల అంచనా ప్రకారం తొలి దశలో కనీసం 50 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదలవుతుందని భావించామన్నారు.
టెట్ సిలబస్ను ఇటీవల విడుదల చేసిన దృష్ట్యా, 25 వేల ఉపాధ్యాయ పోస్టులతో టెట్, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వాల బాధ్యతలు, విధులలో ఉపాధి, ఉద్యోగ కల్పన కూడా ఒక ముఖ్యమైన అంశమనే విషయాన్ని మరచి పోకూడదన్నారు. భర్తీ చేసే పోస్టులు సగం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రోస్టర్ పాటించి ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి అనుబంధ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.