Water Flows Upwards| ఎదురెక్కుతున్న నీటి ప్రవాహం..కేంద్ర మంత్రి విస్మయం

Water Flows Upwards| ఎదురెక్కుతున్న నీటి ప్రవాహం..కేంద్ర మంత్రి విస్మయం

ఎదురెక్కుతున్న నీటి ప్రవాహం..కేంద్ర మంత్రి విస్మయం

విధాత : సహజంగా నీటి ప్రవాహం పల్లం(దిగువ)కు సాగడం ప్రకృతి తత్వం. అందుకే ‘నీరు పల్లమెరుగు’ సామెత పుట్టుకొచ్చింది. అందుకు విరుద్దంగా నీరు ఎగువకు(ఎత్తుకు) ప్రవహిస్తే అదో ప్రకృతి వింత..అద్భుతం. అదొక అద్భుతం..చత్తీస్ గఢ్ లోని మైన్ పట్ ప్రాంతంలో నీటి ప్రవాహం గురుత్వాకర్షక నియమాలకు విరుద్దంగా వ్యతిరేక దిశలో పైకి ప్రవహిస్తున్న వైనం సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తాజాగా కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వింతను స్వయంగా చూసి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. చత్తీస్ గఢ్ అధ్బుతాలతో నిండిపోయిందని.. ఉల్టాపానీగా పేరొందిన మైన్ పట్ చూశాను..అక్కడ నీరు ఎత్తుకు ప్రవహించడాన్ని చూడటం ఇదే తొలిసారి అని తన అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు అక్కడ కారును న్యూట్రల్ చేసి పెడితే అది కూడా ఎత్తుకు ప్రయాణించిందని… ఒక కాగితపు పడవను వదలి చూడగా.. కింది నుంచి పైకి వెళ్లిందని..ఇదంతా చూడటానికి అశ్చర్యంగా..అధ్బుతంగా ఉందని తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనప్పటికీ.. ఈ రహస్యం ఎంతో ఆసక్తికరంగా ఉంది అని చౌహాన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు.


ఛత్తీస్‌గఢ్ సుర్గుజా జిల్లాలోని ఓ కొండ ప్రాంతమే మైన్‌పట్‌. ‘ఛత్తీస్‌గఢ్‌ సిమ్లా’గా దీన్ని పిలుస్తుంటారు. ఇక్కడ నీరు వ్యతిరేక దిశలో ప్రవహించే ప్రాంతాన్ని ‘ఉల్టా పానీ’ (రివర్స్ వాటర్) లేదా ‘బిసార్ పానీ’గా పిలుచకుంటారు. మెయిన్‌పట్ ప్రాంతం అంబికాపూర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో..రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ నుంచి సుమారు 360 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హిల్ స్టేషన్‌లో ‘ఉల్టా పానీ’తో పాటు, ట్రెక్కింగ్, జోర్బింగ్ బాల్, ర్యాప్‌లింగ్ వంటి సాహస క్రీడలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కొన్నేళ్లుగా పర్యాటక కేంద్రంగా మారి దేశవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తోంది.