రాష్ట్ర ప్రభుత్వ విధానాల విషయమై ప్రతిపక్ష బీఆరెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్కు, అధికార కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లకు మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం సాగుతుంది.
విధాత : రాష్ట్ర ప్రభుత్వ విధానాల విషయమై ప్రతిపక్ష బీఆరెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్కు, అధికార కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లకు మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం సాగుతుంది. టీఎస్ను టీజీగా మార్చేందుకు, అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం సహా ఇతర అధికారిక పేర్లు మార్చేందుకు 4,639కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుందని, ప్రజాపాలన పేరిట.. ప్రజాధనం వృథా చేస్తుందని క్రిశాంక్ ఆరోపించారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు కోతలపైన, ఆర్టీసీ లోగోపైన, లిక్కర్ బ్రాండ్లపైన, పౌరసరఫరాల శాఖ టెండర్లపైన క్రిశాంక్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శల పోస్టులు పెట్టారు. వాటికి సంబంధించి ఆయనపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కేసులపై క్రిశాంక్ తాజాగా స్పందిస్తూ ప్రభుత్వం అధికారిక జీవోలపై లీకులు ఇచ్చి.. వెంటనే వెబ్సైట్ల నుంచి వాటిని ఉపసంహరించుకుని, వాటిని ప్రశ్నిస్తూ పోస్టు చేసిన వారిపై కేసులు బనాయిస్తుందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, డైవర్షన్ రాజకీయాలు చేస్తూ గత ప్రభుత్వ కార్యక్రమాలపై విచారణల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ బ్రాండ్లపై తాము చేసిన ఆరోపణలు ఇప్పటికే మంత్రి జూపల్లి కప్పదాట్లతో నిజమని నిరూపితమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్యానే లిక్కర్ బ్రాండ్ల అనుమతులపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనుకడుగు వేసిందని ఆరోపించారు.
ఆరోపణలు కాదు..ఆధారాలు చూపించాలి : బల్మూరి
కాంగ్రెస్ ప్రభుత్వంపైన, సీఎం రేవంత్రెడ్డిపైన సోషల్ మీడియా వేదికగా బీఆరెస్ నేత మన్నె క్రిశాంక్ చేస్తున్న ఆరోపణలకు ఆదారాలు చూపిస్తే ప్రభుత్వం తరుపునా క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధమని, లేదంటే కేసీఆర్, కేటీఆర్లు క్షమాపలు చెప్పాలని బల్మూరి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై పనిగట్టుకొని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ పెట్టి తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. క్రిశాంక్పై ఇప్పటికే తప్పుడు ఆరోపణలకు సంబంధించి కేసులు పెట్టినా బుద్ధి మారడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక లోగో, టీజీ, తెలంగాణ తల్లి విగ్రహం వంటి వాటి మార్పుకు 4,639కోట్ల ఖర్చు చేస్తున్నారని దుష్ప్రచారం చేశారని, తప్పుడు పత్రాలు సృష్టించి బీఆరెస్ అఫిషియల్ అకౌంట్స్ లలో పెట్టి నిజమని నమ్మిస్తున్నారని. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శిలు చేయడం కాదనమని, తప్పుడు ప్రచారాలు చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. గురుకుల, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన పడనవసం లేదని, కొందరు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తాననని, పదిహేను రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తానని బల్మూరి ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కొక్కటి సరి చేస్తున్నామని, ఒక్క ఇబ్బంది కలగకుండా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామని చెప్పుకొచ్చారు. నీట్ పరీక్షల్లో అక్రమాలపై ఎన్ఎస్యూఐ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన కార్యక్రమం నిర్వహించిందన్నారు.