విధాత బ్యూరో, కరీంనగర్: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక వర్గం శుక్రవారం నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలు పెంచేందుకు దోహదపడింది. 3 గంటల ప్రాంతంలో మజ్లీస్ జెండాలతో ఉన్న ద్విచక్ర వాహనాలపై సుమారు 50 మంది యువకులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ నివాసం, ఎంపీ కార్యాలయం వద్ద అలజడి సృష్టించారు. ఎంపీ కార్యాలయ చౌరస్తాను బ్లాక్ చేసిన సదరు యువకులు బీజేపీకి, హిందూత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.
బీజేపీ కార్యకర్తలు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తొలుత 50 మందికి పైగా యువకులు బైకులపై మజ్లిస్ జెండాలు పట్టుకుని ఎంపీ కార్యాలయానికి వచ్చి బండి సంజయ్, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చినట్టు తెలిపారు. ఈలోగా కార్యాలయంలో ఉన్న కొందరు బీజేపీ కార్యకర్తలు తోటి వారికి సమాచారం ఇవ్వడంతో పలువురు బీజేపీ కార్యకర్తలు అక్కడికి రావడం ప్రారంభించారు. దీంతో అక్కడి నుండి వెళ్లి పోయిన సదరు యువకులు నేరుగా బండి సంజయ్ నివాసానికి వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలిపారు.
జరిగిన సంఘటనను బీజేపీ నాయకులు తీవ్రంగా పరిగణించారు. పెద్ద సంఖ్యలో మజ్లిస్ యువకులు ర్యాలీగా ఎంపీ కార్యాలయం వైపు రావడానికి అనుమతి ఎలా ఇచ్చారని పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేసేందుకు అనుమతి ఇవ్వకుండా హౌజ్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు… బండి సంజయ్ ఇంటిమీదకు, ఎంపీ కార్యాలయంపై ర్యాలీగా వస్తున్న వారిని ఎందుకు అడ్డుకోలేక పోయారని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల, నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, మజ్లిస్ చేస్తున్న కుట్రలకు పోలీసులు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాన్ని బండి సంజయ్, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తదుపరి కార్యాచరణ చేపట్టేందుకు కరీంనగర్ బీజేపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీజేపీ నాయకులిచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఎంపీ కార్యాలయానికి వచ్చారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, కార్పొరేటర్ రాపర్తి ప్రసాద్, ఉప్పరపల్లి శ్రీనివాస్ నుంచి వివరాలు సేకరించారు.