‘‘నమ్మించి గొంతు కోసే రకం కేసీఆర్.. మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు మీ ముందుకొస్తున్నడు. అడ్డం పొడుగు మాటలు మాట్లాడి... అరచేతిలో వైకుంఠం చూపి, హామీలతో ఊరించి మాట్లాడుతూ ఓట్లు దండుకునేందుకు సిద్దమైండు.
మళ్లీ డ్రామాలతో ఓట్లు దండుకునేందుకు మీ ముందుకొస్తున్నడు
10 ఏళ్లలో కేసీఆర్ చేసిన మోసాలను గుర్తు చేసుకోండి
కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించేందుకు, ఢిల్లీకి కప్పం కట్టేందుకు డబ్బులిస్తున్న కాంగ్రెస్
6 గ్యారంటీలను అమలు చేసేందుకు డబ్బుల్లేవనడం సిగ్గు చేటు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
విధాత బ్యూరో, కరీంనగర్: ‘‘నమ్మించి గొంతు కోసే రకం కేసీఆర్.. మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు మీ ముందుకొస్తున్నడు. అడ్డం పొడుగు మాటలు మాట్లాడి… అరచేతిలో వైకుంఠం చూపి, హామీలతో ఊరించి మాట్లాడుతూ ఓట్లు దండుకునేందుకు సిద్దమైండు. రాష్ట్ర ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు విజ్ఝప్తి చేసేదొక్కటే. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన మోసాలను, పాపాలను గుర్తు చేసుకోండి. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులుసహా ప్రశ్నించే గొంతులను నులిమి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోండి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు పేరుతో చేసిన మోసాన్ని స్మరించుకోండి… రెండు పార్టీలకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పండి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కోరారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ ఆదివారం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిశారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్ధించారు. మోదీ ప్రధాని కావాలన్నదే తమ అభిమతమని, బీజేపీకే మద్దతిస్తామని వాకర్స్ బాహాటంగానే ప్రకటించారు. తెలంగాణ ప్రజల పక్షాన, కరీంనగర్ కోసం బండి సంజయ్ ఎన్నో పోరాటాలు చేశారని, ఆయనను ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో దానిని అనుకూలంగా మనసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాత్రలు మొదలుపెట్టారని ఆరోపించారు. కొంతమంది సోకాల్డ్ మేధావులతో సోషల్ మీడియాలో కేసీఆర్ కు మించినవారు లేరనే ప్రచారంతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయిస్తున్నారని సంజయ్ అన్నారు. తన పదవీకాలంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు.. వడ్ల కుప్పలపై గుండె ఆగి రైతులు చనిపోతే కనీసం స్పందించలేదు… ఇక్కడి రైతులను ఆదుకోకుండా పంజాబ్ పోయి అక్కడి రైతులకు ఆర్థిక సహాయం చేసి దానిని ప్రచారం చేసుకున్న విషయాలను గుర్తు చేశారు. తన పదేళ్ల పాలనలో తెలంగాణను ఏటీఎంగా వాడుకుని, కుటుంబానికి వేల కోట్ల రూపాయలు దోచి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
ప్రశ్న పత్రాల లీకేజీలతో విద్యార్థుల ఆత్మహత్యలకు, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆయన చెలగాటం ఆడుకొన్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ చేయించి 30 లక్షల నిరుద్యోగుల బతుకులను రోడ్డున పడేశారని, ప్రశ్నించిన వాళ్లను లాఠీలతో కొట్టించాడని విమర్శించారు. చివరకు ఫోన్ ట్యాపింగ్ తో భార్యా,భర్తలు కూడా ఫోన్లలో మాట్లాడుకోలేని పరిస్థితి తీసుకువచ్చారని చెప్పారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఓట్లు అడగడానికి వస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
కరీంనగర్ లో కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా విస్మరించి మళ్లీ ఓట్ల కోసం డ్రామాలాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అనుకూల కాంట్రాకర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించడానికి ఢిల్లీకి కప్పం కట్టడానికి…తెలంగాణ సొమ్మును దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడానికి సొమ్ము లుంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి లేవంటారా? అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు పంపే సొమ్ముతో కరీంనగర్ లో కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులు కొంటున్నారని, ఆరోపించారు. భవిష్యత్తులో భూకబ్జాలు చేసి వాళ్ల మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా అరెస్ట్ కావడం తథ్యమన్నారు. మోసాలు, దోపిడీలు చేస్తూ ఓట్లు అడగడానికి వస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొందపెట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.