కాళేశ్వరం అవినీతిపై ప్రాజెక్టుల సందర్శనతో ఎమ్మెల్యేలు చేసేదేమి ఉండదని, విచారణను సీబీఐకి అప్పగించాలని గతంలో కాంగ్రెస్ కూడా ఇందుకు డిమాండ్ చేసిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సూచించారు
విధాత : కాళేశ్వరం అవినీతిపై ప్రాజెక్టుల సందర్శనతో ఎమ్మెల్యేలు చేసేదేమి ఉండదని, విచారణను సీబీఐకి అప్పగించాలని గతంలో కాంగ్రెస్ కూడా ఇందుకు డిమాండ్ చేసిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సూచించారు. కృష్ణా ప్రాజెక్టుల తీర్మానం చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆరెస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని ఆ పార్టీ డ్రామాలు అడుతోందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అన్యాయం చేశారన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల చర్చలో ప్రభుత్వం బీఆరెస్, హరీశ్ రావుల ట్రాప్లో పడవద్దని సూచించారు. నాగార్జున సాగర్పై ఏపీ ప్రభుత్వం చేసిన ఆక్రమణతో రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా కేంద్రం ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకోవాలనుకుందన్నారు. ఏపీ ప్రభుత్వం 15 ఔట్లెట్ల నుంచి నీటిని తరలించుకుపోతుంటే ఆపలేని శక్తి మనకు లేనప్పుడు కేఆర్ఎంబీ జోక్యం అవసరముందన్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని ప్రభుత్వం ఎందుకు తీర్మానం చేసిందో సీఎం స్పష్టత నివ్వాలన్నారు.