Harish Rao | రుణమాఫీపై సీఎం, మంత్రుల తలోమాట.. ఎవరి మాట నమ్మాలి: మాజీ మంత్రి టి.హరీశ్ రావు

రైతు రుణమాఫీ లెక్కలపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తలోమాట చెబుతున్నారని, రైతులు ఎవరి మాట నమ్మాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ప్రశ్నించారు.

Harish Rao | రుణమాఫీపై సీఎం, మంత్రుల తలోమాట.. ఎవరి మాట నమ్మాలి: మాజీ మంత్రి టి.హరీశ్ రావు

Harish Rao | రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) లెక్కలపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తలోమాట చెబుతున్నారని, రైతులు ఎవరి మాట నమ్మాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రూ. 31 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్టు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ పూర్తి చేసినట్లు డబ్బా కొడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం రుణమాఫీ పూర్తి కాలేదంటున్నారన్నారు.

మొన్న ఖమ్మం (Khammam) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రూ. 18 వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా చేసినట్లు ప్రకటిస్తే, ఇందుకు భిన్నంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఇంకా రూ. 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామన్నారని గుర్తు చేశారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారని, ఇక ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే పచ్చి అబద్ధం చెప్పారన్నారు. ఏకంగా రూ. 31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారన్నారు. ఇంతకు రుణమాఫీపై ఏది నిజం.. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.

ఒకవైపు రుణమాఫీ కాక రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తుంటే, భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి మరింత గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. మీరు చెబుతున్నట్లు రుణమాఫీ జరిగి ఉంటే బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, కలెక్టరేట్ల చూట్టూ రైతులు ఎందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎందుకు రోడ్లెక్కి రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ పూర్తి కాలేదన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి ఒప్పుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని, వెంటనే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 వరకు రైతులందరిని రుణవిముక్తులుగా చేస్తానన్న హామిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని బీఆరెస్‌ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.