తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి టి.హరీశ్రావు మండిపడ్డారు
రైతుల వరుస ఆత్మహత్యలపై హరీశ్రావు మండిపాటు
విధాత : తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి టి.హరీశ్రావు మండిపడ్డారు. ఈ మేరకు హరీశ్రావు ట్వీట్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడని, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్నసీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఈ రెండు ఘటనలు మరువక ముందే గురువారం ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యాడని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని దుయ్యబట్టారు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకువచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆరెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు.