Harish Rao | డయగ్నిస్టిక్ వ్యవస్థను నాశనం చేశారు: హారీశ్‌రావు

రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆరెస్‌ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Harish Rao | డయగ్నిస్టిక్ వ్యవస్థను నాశనం చేశారు: హారీశ్‌రావు

విధాత: రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆరెస్‌ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని తెలిపారు.

లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆరోపించారు. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందని, ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం అని హ‌రీశ్‌రావు విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నొస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని బీఆరెస్‌ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.