MLA Harish Rao, | రైతులపై లాఠీచార్జ్ ఇందిరమ్మ రాజ్యమా: హరీశ్రావు ఫైర్
ఆదిలాబాద్లో విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీచార్జ్ చేసిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ట్విటర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.

విధాత : ఆదిలాబాద్లో విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీచార్జ్ చేసిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ట్విటర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తెస్తామన్న మార్పు రైతులపై లాఠీచార్జ్ చేయడమేనా..ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని హరీశ్రావు నిలదీశారు. పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరమన్నారు. రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలు అన్నిఇన్నీ కావని, సాగుకు నీరు లేక పంటలు ఎండిపోయాయని, పండిన ధాన్యం అమ్ముకుందామంటే మద్దతు ధర లేదని, చివరకు ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు కొందామంటే అవి కూడా అందుబాటులో లేవన్నారు. విత్తనాల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీలు ఝులిపించారన్నారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని, ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు.