CM REVANTH REDDY | మా పోటీ ప్రపంచంతోనే..ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుందన్నారు.

మా పోటీ ప్రపంచంతోనే
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ
మా చిత్తశుద్ధిని నిరూపిస్తుంది
రాజధాని నగరానికి 3 రింగ్స్
కోర్ అర్బన్ ఏరియాగా హైదరాబాద్
తయారీ కేంద్రంగా సెమీ-అర్బన్ ఏరియా
ఓఆర్ఆర్ వెలుపల అత్యుత్తమ గ్రామాలు
10 ఏళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
కాగ్నిజెంట్ కొత్త ప్రాంగణానికి ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుందన్నారు. తమ పోటీ ఏపీ, కర్ణాటకతో కాదని, ప్రపంచంతోనని ప్రకటించారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ అని పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయన్న రేవంత్రెడ్డి.. ‘మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్, రెండోది సెమీ-అర్బన్ ఏరియా.. ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం’ అని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు తాను చేసిన విదేశీ యాత్ర విజయవంతమైందని చెప్పారు. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. అమెరికా, కొరియాలో తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పొరేట్ దిగ్గజాలు తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని చెప్పారు. విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం హైదరాబాద్కు తిరిగి వచ్చిన రేవంత్రెడ్డి.. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని నేను హామీ ఇచ్చాను. హైదరాబాద్లో కాగ్నిజెంట్కు ఎంతో ప్రాధాన్యత ఉంది’ అన్నారు. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉందని అన్నారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి పునాది పడిందని గుర్తు చేశారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్ధిని కొనసాగించారని, సైబరాబాద్ సిటీని అభివృద్ధి చేశారని తెలిపారు. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని చెప్పారు. ‘పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నా. రండి.. పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు.