కోదాడ ఎంపీపీ పదవికి చింతా కవిత రాజీనామా
సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ సీఈఓకి తన రాజీనామా లేఖను స్వయంగా అందజేశారు.

♥ సీఈఓకు రాజీనామా లేఖ అందజేత
♥ ఎంపీటీసీల అవిశ్వాసంతోనే ఈ నిర్ణయం
♥ విలేకరులతో చింతా కవిత
సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ సీఈఓకి తన రాజీనామా లేఖను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా చింతా కవితా రాదారెడ్డి మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుండి వచ్చినప్పటికీ రాజకీయాలకు కొత్తయినా ఎంపీటీసీగా, ఆ తదుపరి ఎంపీపీగా అవకాశం కల్పించిన బీఅర్ఎస్ పార్టీకి, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కు, గుడిబండ గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.
తనకు ఇచ్చిన సదావకాశాన్ని తన శక్తికి మించి గుడిబండ గ్రామంతో పాటుగా మండల పరిధిలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేశానన్నారు. మండలాన్ని ఆదర్శంగా నిలపడం సంతోషాదాయకమని చెప్పారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, చేసిన సేవ మాత్రమే శాశ్వతమని అన్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా తనకు అండగా నిలబడి, ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీలే వ్యతిరేకిస్తూ తనపై అవిశ్వాసం పెట్టారన్నారు. దీంతో మండల అధ్యక్షురాలిగా వారు తనపట్ల విముఖతతో ఉన్నారని భావిస్తున్నట్లు చెప్పారు.
వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లడం ఇష్టం లేక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మనస్సాక్షికి లోబడి నైతికబాధ్యతగా మండల అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే సీఈఓకు తన రాజీనామా లేఖ సమర్పించినట్లు వెల్లడించారు. తన రాజీనామాలో ఎలాంటి వ్యక్తిగత, రాజకీయ దురుద్దేశాలు లేవని, ఎవరి ఒత్తిడి, ప్రోద్బలం లేకుండా తన ఇష్టపూర్తిగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
ఈ నాలుగున్నరేళ్ల కాలంలో తనకు అన్నివిధాలుగా సహకరించి, తోబుట్టువుగా భావించి అక్కున చేర్చుకుని ఆదరించిన ప్రజలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీపీ వెంట మోతె మండల అధ్యక్షులు శీలం సైదులు, మండల సర్పంచులు శెట్టి సురేష్ నాయుడు, పాముల మస్తాన్, భూక్యా సైదా, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ ఉద్దండు, దాసరి వీరబాబు, అంబడిపూడి రవి కుమార్ ఉన్నారు