గత పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ చేతిలో మెదక్ ప్రాంతం మగ్గిపోయిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బలహీనవర్గాల బిడ్డ నీలం మధుకు మెదక్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని చెప్పారు. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు కేంద్రం నుంచి నిధులు తెస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. మల్లన్న సాగర్లో వేల మంది రైతుల భూములను ముంచింది బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని ఆరోపించారు.
నర్సాపూర్/ఎల్బీనగర్ : బీజేపీ వాళ్లకు ఎన్నికలప్పుడే రాముడు, హనుమాన్ జయంతి, బతుకమ్మ పండుగ గుర్తుకు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. గురువారం రాహుల్ గాంధీతో కలిసి నర్సాపూర్, ఎల్బీ నగర్లలో జరిగిన జనజాతర సభలలో ఆయన ప్రసంగించారు. బీజేపీ వాళ్లు ఇప్పుడు మనకు సంప్రదాయాలు నేర్పాల్సిన అవసరం లేదని ఎద్దెవా చేశారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి కానీ బీజేపీ వాళ్లు ఎన్నికల కోసం భిక్షగాళ్లలా మారి, రాముడిని, హనుమంతుడిని వాడుకుంటున్నారని విమర్శించారు.
మండుటెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ అని రేవంత్ అన్నారు. దేశ చరిత్రలో మెదక్ పార్లమెంట్ స్థానానికి గొప్ప పేరుందని, 1980లో మెదక్ నుంచి ఇందిరా గాంధీ బరిలోకి దిగి అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రధాని అయ్యారని తెలిపారు. ఇందిరాగాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం వల్లనే మెదక్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. మెదక్ ఎంపీగా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ మరణించారని గుర్తు చేశారు.
గత పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ చేతిలో మెదక్ ప్రాంతం మగ్గిపోయిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బలహీనవర్గాల బిడ్డ నీలం మధుకు మెదక్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని చెప్పారు. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు కేంద్రం నుంచి నిధులు తెస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. మల్లన్న సాగర్లో వేల మంది రైతుల భూములను ముంచింది బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని ఆరోపించారు. మన భూములు గుంజుకొని ఆధిపత్యం చెలాయిస్తున్న వెంకట్రామిరెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంతం పైన ఉందన్నారు.
ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డిని మళ్లీ ఎంపీగా పోటీ చేయిస్తున్నారన్న రేవంత్.. వందల కోట్లు ఇస్తున్నాడు కాబట్టే కేసీఆర్, హరీశ్ రావు కరీంనగర్ నుంచి వెంకట్రామిరెడ్డిని తెచ్చి ఇక్కడ పోటీ చేయిస్తున్నారని విమర్శించారు. మెదక్ ఎంపీగా పోటీ చేయించడానికి ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడే లేడా? అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం, ముదిరాజ్లను బీసీ ‘ఏ’ మార్చడం కోసం, రిజర్వేషన్లు రద్దుకు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాటానికి నీలం మధును గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ బస్సు యాత్ర చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్ళకు పోయినట్టే ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఎంపీగా నీలం మధును గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సోనియమ్మ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తే… ప్రధాని మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు.. అందుకే బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును లక్ష మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ ప్రజలను కోరారు.
బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని రాహుల్ గాంధీ అన్నారు. భారత రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు. అది పేద ప్రజల గుండె చప్పుడని తెలిపారు. రిజర్వేషన్లు వచ్చింది మన రాజ్యాంగం వల్లేనన్నారు. రాహుల్, రేవంత్ లాంటి వాళ్ళం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పారు. మోదీ ప్రజలకు చెందిన లక్షల కోట్లను 22 మంది పెట్టుబడిదారులకు పంచారన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేస్తాని చెప్పారు. తప్పుడు నిర్ణయాలతో మోదీ నిరుద్యోగం పెంచారన్న రాహుల్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తామని పేర్కొన్నారు.