విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలకు నిరాశే మిగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల మొదటి జాబితా లీక్ అయ్యిందనే సమాచారం చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆశావహులు గాంధీ భవన్ బాట పట్టారు. లీక్ అయిన జాబితాలో పేర్లు లేవని కొందరు, ఆశించిన నియోజకవర్గం రాలేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నారాయణ పేట, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, గద్వాల, మహబూబ్ నగర్, షాద్ నగర్, మక్తల్ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించినట్లు సమాచారం.
కొత్తగా వారికి చాన్స్
ఈ సారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించే వారిలో ఎన్నడూ అసెంబ్లీ బరిలో పోటీ చేయని అభ్యర్థులు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ జాబితాలో ఉమ్మడి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు కన్పించనున్నాయి. ఇంతవరకు అసెంబ్లీకి పోటీ చేయని జడ్చర్ల నియోజకవర్గం నుంచి అనిరుద్ రెడ్డి, మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి, గద్వాల నుంచి సరిత, నాగర్ కర్నూల్ నుంచి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, షాద్ నగర్ నుంచి వీర్ల పల్లి శంకర్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. వీరంతా కొత్తగా అసెంబ్లీ స్థానం కోసం పోటీలో ఉంటున్నారనే సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అధికారికంగా ఈనెల 10న వెలువడే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి పరిశీలిస్తే…
నారాయణ పేట నియోజకవర్గం
టికెట్ ఆశిస్తున్న వారిలో కుంభం శివకుమార్ రెడ్డి పేరు మొదటి స్థానంలో ఉంది. 2018 ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఊహించని ఓట్లు రాబట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే అధికంగా ఓట్లు రాబట్టుకున్నారు. కులాల ప్రాతిపదికగా బీసీ సామాజిక వర్గానికి టికెట్ వెళ్లడంతో శివకుమార్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. అప్పటి తెరాస పార్టీ కి చెమటలు పట్టించిన కుంభం చివరి నిమిషంలో స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు.
ఎన్నికల తరువాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరి, నారాయణ పేట డీసీసీ అధ్యక్షులు అయ్యారు. అప్పటినుంచి పార్టీనే నమ్ముకున్న ఆయన ఈసారి ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ ఈ నియోజకవర్గం అభ్యర్థిగా ఎర్ర శేఖర్ ను కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు రావడంతో శివకుమార్ రెడ్డి అనుచరులు ఆదివారం గాంధీ భవన్ బాట పట్టారు. టికెట్ రాకుంటే పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేస్తామని కోయిలకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విద్యాసాగర్ గౌడ్ వెల్లడించారు. అధిష్టానం నిర్ణయంతో ఇక్కడ పార్టీకి పూర్తిగా నష్టం జరుగుతుందన్నారు.
జడ్చర్ల నియోజకవర్గం
నల్గొండ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రోద్బలంతో జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ జనంపల్లి అనిరుద్ రెడ్డికి ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక్కడి పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. కానీ టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్ వర్గం మాత్రం నిరాశ చెందుతున్నారు. నారాయణ పేట నియోజకవర్గం టికెట్ ఇచ్చినా ఆయన అయిష్టంగానే ఉన్నట్లు సమాచారం. ఎర్ర శేఖర్ కు జడ్చర్ల నియోజకవర్గంలో కొంత పట్టు ఉంది.
నారాయణ పేట నియోజకవర్గంలో ఆయనకు కొంచం కూడా పట్టు లేకపోవడంతో ఓటమి తప్పదనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. జడ్చర్ల నియోజకవరర్గానికి రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గా కొనసాగిన ఎర్ర శేఖర్ కు కొంత సొంత క్యాడర్ కూడా ఉంది. అందుకే ఆయన ఈ నియోజకవర్గం వైపే చూపు నిలిపారు. ఇక్కడి ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డిని ఎదుర్కోవాలంటే అనిరుద్ రెడ్డికి సాధ్యం అవుతుందో లేదో అని ఆ పార్టీ నేతలే అంటున్నారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గం
ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ అయిందనే వార్తలు బయటికి వస్తున్నాయి. దీంతో సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఖంగు తిన్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని శత విధాలుగా ప్రయత్నం చేసిన నాగంకు నిరాశ మిగిలినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపిస్తామని రెండు రోజుల ముందే నాగంకు అధిష్టానం చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. ఆతరువాతే రాజేష్ రెడ్డికి టికెట్ కేటాయించినట్లు సమాచారం. నాగం, కూచుకుళ్ళ ఒక్క తాటిపై నడుస్తే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగులేని శక్తి గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరారు. కల్వకుర్తి కాంగ్రెస్ టికెట్ ఆయనకే వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంటే ఉండడంతో కాంగ్రెస్ కి తిరుగు లేదనే భావనలో పార్టీ అధిష్టానం కసిరెడ్డి వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన కసిరెడ్డిని ఆ పార్టీ అధిష్టానం పక్కన పెట్టడంతో పార్టీని వీడి కాంగ్రెస్ పక్కన చేరారు. కసిరెడ్డికి టికెట్ వచ్చిందనే విషయం బయటకు రావడంతో ఇక్కడి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇదంతా అపోహ మాత్రమే అని, టికెట్ తనకే వస్తుందని, కార్యకర్తలు దైర్యంగా ఉండాలని వంశీ చెప్పినట్లు తెలిసింది.
గద్వాల నియోజకవర్గం
ఈ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా సరితను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. గద్వాల జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఇదే అభిమానంతో కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి ఆమెకు గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఈమె సామాజిక వర్గం నేత కురుమ విజయ్ కుమార్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. సరితకు టికెట్ వచ్చిందనే విషయం నియోజకవర్గంలో తెలియడంతో ఆయనకు ఆశ నిరాశ అయింది. టికెట్ రాలేదని భంగపడిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఉంటారా? లేదా? అనే విషయం త్వరలో తెలియనుంది.
మహబూబ్ నగర్ నియోజకవర్గం
ఈ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పేరు దాదాపుగా ఖారైనట్లు సమాచారం. ఆయన కూడా ఇటీవల బీజేపీని వదిలి కాంగ్రెస్ పంచన చేరారు. ఈ నియోజకవర్గంలో ఎన్నం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండడంతో ఆయనకు ఇక్కడ మంచి పట్టు ఉంది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, తెరాస అభ్యర్థిని ఓడించారు. రెండేళ్లుగా ఎమ్మెల్యే గా ఉన్న ఆయన నియోజకవర్గం అందరి మన్నలను పొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు ఎన్నం సిద్ధం కావడంతో ఈ స్థానం మహాకూటమికి వెళ్లింది.
దీంతో టీడీపి అభ్యర్థిగా ఎర్ర శేఖర్ పోటీలో ఉన్నారు. ఆయన తెరాస అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ చేతిలో ఘోరంగా ఓటమి చెందారు. ఎన్నం పోటీలో ఉంటే గెలిచే వారని అప్పట్లో అందరూ అనుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ ఆయనకే వచ్చిందనే విషయం తెలియడంతో ఆపార్టీ శ్రేణులు ఆనందంలో ఉన్నారు. ఇక్కడి కాంగ్రెస్ టికెట్ ఆశించిన సంజీవ్ ముదిరాజ్, ఓబేదుల్లా కొత్త్వాల్ నిరాశలో ఉన్నారు. ఇదంతా ఊహ జనితమే అని, టికెట్ మాకే వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎన్నంకు టికెట్ వస్తే వీరిద్దరూ ఆయనకు మద్దతుగా ఉంటారో లేదో తెలవాల్సి ఉంది.