దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, మోడీ నుండి ప్రజలకు ఎదురవుతున్న ప్రమాదాన్ని నిలువరించేందుకే సీపీఐ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు
– ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
– బీఆర్ఎస్, బీజేపీని ఓడిస్తాం.. కాంగ్రెస్ ను గెలిపిస్తాం
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
విధాత, వరంగల్ ప్రతినిధి: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, మోడీ నుండి ప్రజలకు ఎదురవుతున్న ప్రమాదాన్ని నిలువరించేందుకే సీపీఐ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హనుమకొండలోని సిపిఐ జిల్లా కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు ఎన్నికల ఇంచార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి కడియం శ్రీహరి విచ్చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సీపీఐ జిల్లా, మండల కార్యదర్శులు,ముఖ్య నాయకులతో సమావేశమై మే 13న జరిగే వరంగల్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య కు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. అనంతరం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను మోడీ తన గుప్పిట్లో పెట్టుకుని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టి ప్రజల తీర్పును అపహాస్యం చేశారని అన్నారు. మరోవైపు ఐక్యంగా ఉన్న దేశ ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టి రాజ్యాంగం స్థానంలో మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. గడిచిన పదేళ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లిం, క్రిస్టియన్ లను దూషిస్తూ మసీదులు, చర్చిలను కూలగొడుతూ, మహిళలపై అత్యాచారాలకు, దళితులు,గిరిజనులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. దేశంలో కులగణన చేయకుండా బీసీలను సైతం అణిచివేశారని, పేదలకు సరైన విద్య,వైద్యం అందించకండా, వారి బతుకులు బాగు చేయాలనే ఆలోచన లేకుండా మతతత్వ చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. చివరకు మీడియాను గుప్పిట్లో పెట్టుకుని విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.ఇది ప్రమాదకర నియంతృత్వానికి దారి తీస్తుందని, చివరకు శాశ్వత ప్రధానిగా మోడీ ప్రకటించుకున్నా ఆశ్చర్యం లేదని అన్నారు. అయినప్పటికీ వామపక్ష, అంబేద్కర్ భావజాలం దేశంలో ఉన్నందునే ఇంకా ప్రజాస్వామ్యం మనుగడలో ఉందన్నారు. దేశంలో పరిణామాలను గమనించి రాష్ట్రంలో ఒక్క స్థానం ఇవ్వకున్నా ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సీపీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని, వరంగల్ పార్లమెంటు ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ను గెలిపిస్తామని చెప్పారు. దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలను రోడ్డు పాలు చేస్తుందని అన్నారు. ముఖ్యంగా పేదలు, దళితులు, గిరిజనులు,బీసీలు, మైనారిటీల వ్యతిరేక పార్టీగా బీజేపీ మారిందని, అలాంటి బీజేపీ ని ఖచ్చితంగా ఓడించి తీరుతామని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. విజయ సారథి, జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి, కె. రాజ్ కుమార్, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, రాష్ట్ర నాయకులు టి. విశ్వేశ్వర రావు, ఎస్ కే బాష్ మియా, మద్దెల ఎల్లేష్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, మోటపలుకుల రమేష్,కె. సుగుణ తదితరులు పాల్గొన్నారు.