దేశానికి గుండెకాయ అలాంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారని దళిత హక్కుల పోరాట
విధాత, వరంగల్ ప్రతినిధి: దేశానికి గుండెకాయ అలాంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారని దళిత హక్కుల పోరాట సమితి(డి హెచ్ పి ఎస్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అన్నారు. వరంగల్లో గురువారం మీడియా సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఏనాడు ఈ దేశానికి పునాది అయిన రాజ్యాంగాన్ని గౌరవించలేదన్నారు. బీజేపీ మను రచించిన రాజ్యాంగాన్ని కోరుకుంటూ వచ్చారని చెప్పారు. ఇది ముమ్మాటికి రాజ్యాంగ న్యాయానికి విరుద్ధమని విమర్శించారు. రాజ్యాంగ ధర్మాన్ని అడ్డుకునే దుర్బుద్ధిని తిప్పికొట్టాలని కోరారు. అంతరాలను సృష్టించే మను సిద్ధాంతంపై దళితులు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారని తేల్చిచెప్పారు.
అందులో భాగంగానే 2024 ఎలక్షన్స్ చాలా కీలకమైనవిగా గుర్తిస్తున్నామన్నారు. మనువాద శక్తులు 2024 ఎన్నికల్లో అధికారాన్ని తమ వశం చేసుకుంటే ముందుతరాలు ఊహించని అమానవీయమైన జీవితాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి, రాజ్యాంగ వర్గాలు తమ రాజ్యాంగ అధికారం, పాలన కోసం బిజెపిని ఓడించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2017 బీహార్ ఎలక్షన్లలో ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్ ఈ రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు.
ఆర్ఎస్ఎస్ బిజెపి మొదటి నుండి కూడా రిజర్వేషన్లను సమర్ధించలేదు, సామాజిక వెనుకబాటుతనం కేంద్రంగా ఉన్న రాజ్యాంగంలో ఆర్టికల్ 15, 16 లను ప్రశ్నించడం ఆర్ఎస్ఎస్ బిజెపి రక్తంలోనే ఉంది. ఎస్సీ ,ఎస్టీ, ఓబీసీలు రాజ్యాంగం కల్పించిన అవకాశాల ద్వారా కొన్ని మెరుగైన అవకాశాలు పొందారు అది జీర్ణించుకోలేని ఆర్ఎస్ఎస్, బిజెపి రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు కాబోతున్న ఒక దళితున్ని, ఓబీసీని, ఆదివాసిని గాని ఆర్ఎస్ఎస్ చీఫ్ గా నియమించారా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో డి హెచ్ పి ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘీ ఎల్లెందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ను రవి, డి హెచ్ పి ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు నిమ్మల మనోహర్,జిల్లా కార్యదర్శి రొంటాల దేవా, నాయకులు చెంచల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.