భారత రాష్ట్ర సమితి (బీఆరెస్)గా పేరు మార్చి దేశ రాజకీయాల్లో ఛక్రం తిప్పాలని భావించిన ఆ పార్టీ ఒక్క ఓటమితో బొక్కాబోర్లాపడింది
ముందు నుయ్యి…వెనుక గొయ్యి
పార్టీలో అంతర్గతంగా అసమ్మతి
గుత్తా వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం
పొంచిఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
పడిపోయిన అధినేత కేసీఆర్ ప్రతిష్ట
తిరిగి పెంచేందుకు తీవ్ర ప్రయత్నం
కేటీఆర్,హరీష్ లు గట్టెక్కించేనా?
లోక్ సభ ఫలితాలపైన్నే కాస్త ఆశ
కేసీఆర్ పర్యటన నమ్మకమిస్తుందా?
విధాత ప్రత్యేక ప్రతినిధి: భారత రాష్ట్ర సమితి (బీఆరెస్)గా పేరు మార్చి దేశ రాజకీయాల్లో ఛక్రం తిప్పాలని భావించిన ఆ పార్టీ ఒక్క ఓటమితో బొక్కాబోర్లాపడింది. ఎన్నికలకు ముందే ఎజెండా మార్చి తిరిగి తెలంగాణ సెంటిమెంటుతో మరోసారి గట్టెక్కాలని భావించినా నెత్తినపెట్టుకున్న ప్రజలే పాతాళానాకి పడేశారు. నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు గుక్కతిప్పకోలేని దుస్థితి చేరింది. తాజా లోక్ సభ ఎన్నికల రిజల్టుతో పాటు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి, పార్టీ తాజా ఈ పరిస్థితికి తీసుకునే గుణపాఠం పైన్నే ఆ పార్టీ భవితవ్యం ఆదారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకు మాత్రం ఆ పార్టీ అధిష్టానం ఓటమిపై పెద్దగా ఆత్మవిమర్శగానీ, పూర్తిగా సమీక్షించినట్లు లేదు. తాజాగా ఇదే విషయాలను అదే పార్టీకి చెందిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూటిగానే లేవనెత్తడం ఆ పార్టీ తాజా పరిస్థితికి అద్ధంపడుతోంది. రానున్న రోజుల్లో చాలా మంది నాయకుల నుంచి ఇలాంటి అసమ్మతి మాటలను ఎక్కువగా వినాల్సివస్తోంది.
ఒక్క ఓటమేగదా? అని లైట్ తీసుకుంటే….బీఆర్ఎస్ కు పక్కలో బల్లెమైంది. ఆ పార్టీని రాజకీయ లెక్కల్లోనే లేకుండా చేసే పరిస్థితి దాపురించింది. దశాబ్దన్నర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, దశాబ్దకాల అధికారం అనుభవించిన పార్టీ ఒక్క ఓటమికే చక్కరొచ్చింది. వంద రోజుల్లో రాష్ట్రంలో జరిగిన ఈ పరిణామం రాజకీయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. రాజకీయ పరిశీలకులు సైతం ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు దెబ్బతిన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దిగాలుగా మారిందనే చర్చ సాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికలు ఆగం చేయగా కళ్ళముందున్న లోక్ సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కి కొన్ని స్థానాల్లోనైనా ‘పరువు’ నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అందించే అత్యవసరమైన ఆక్సిజన్ గా మారనున్నది. అనేక అవాంతరాల మధ్య సానుకూల పరిస్థితి కోసం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం సర్వశక్తులొడ్డుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు కనీసం ఊపిరిపోయకపోతే ఆ పార్టీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారుతోందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరం చేసినా 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా మసలుకోవాలనే సున్నితమైన హెచ్చరికను జారీ చేశారు. మార్పునకు పట్టంకడుతూ కాంగ్రెస్ ను అధికార పీఠపై కూర్చోబెట్టినప్పటికీ ఏకపక్ష మెజార్టీ ఇవ్వకుండా తెలంగాణ ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శించారు.
నిన్నటి వరకు కారు ఓవర్ లోడ్
నిన్నటి వరకు ఎవరు ఏ పార్టీలో గెలిచినా బీఆర్ ఎస్ పార్టీలోకి చేరిపోయేవారు. చేరకుంటే నయన్నో, భయన్న్ చేర్పించుకునే వారు. అనేక ఒత్తిడులు ఎదురైన తెలంగాణ ఉద్యమకాలమంతా పార్టీ మారేందుకు వెనుకంజ వేసిన కరుడుగట్టిన పార్టీల నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అప్పటి టీఆర్ ఎస్ అధికారంలోకి రావడంతో తెల్లారేసరికి పార్టీ మారిపోయారు. గత పదేండ్లు తెలంగాణలో ఇదో నిత్య కార్యక్రమంగా సాగిపోయింది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరో ఇద్దరో మినహా ఫలనా నాయకుడు పార్టీ మారడనే అభిప్రాయానికి తావులేకుండా పోయింది. వారు వీరు అనేదీ లేకుండా అన్ని పార్టీలకు చెందిన వారంతా బీఆర్ఎస్ లో చేరిపోయారు. కాదు…కాదు చేర్పించుకున్నారనే అభిప్రాయం ఉంది. విపక్షాలకు పోటీచేసే గట్టి అభ్యర్ధిలేకుండా చేసే ప్రయత్నంలో కేసీఆర్ విజయవంతమయ్యారని చెప్పవచ్చు. కారు ఓవర్ లోడ్ తో ఉందనే విమర్శలు వెల్లువెత్తినా విపక్షాలను బలహీనపరచడమే తనకు బలమనే రాజకీయ సూత్రాన్ని కేసీఆర్ తూచా తప్పకుండా పాటించారు.
నిన్నటి వరకు ఆ పార్టీ అత్యంత బలమైన పార్టీగా ఉన్నది. మరో మాటలో చెప్పాలంటే లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపల్ కార్పొరేషన్ లు, జిల్లా పరిషత్ లు, మండల, గ్రామ స్థాయి వరకు అంతా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే ఉన్నారు. వేళ్ళ మీద లెక్కించేంత మంది మాత్రమే విపక్ష పార్టీ ప్రతినిధులున్నారు. ఓ మోస్తారు సంఖ్యలో విపక్షాలు గెలిచినా తెల్లవారేసరికి గులాబీ గూటికి చేరిపోయే వారు. దీంతో గత రెండు టర్ములు రాష్ట్రంలో విపక్షాల పరిస్థితి దయనీయంగా సాగింది.
తీరని మూడవసారి ముచ్చట
అసెంబ్లీ ఎన్నికల వరకు మూడవసారి ముచ్చటగా అధికారం, వందకు పైగా సీట్లు మనవే అంటూ గంభీరంగా ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పుతో ఓటమిపాలైంది. ఎన్నికలన్న తర్వాత గెలుపోటములు సహజం ఈ అనుభవం బీఆర్ఎస్ కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూ బాగానే ఉంది. ఇక పార్టీ ఫిరాయింపులు, జంప్ జిలానీలు, మార్పులు, చేర్పులు కూడా అనుభవించారు. కానీ, గత దెబ్బలకు, ఈ దెబ్బకు చాలా తేడా ఉందని తేటతెల్లమైతోంది.
కనిపించని ఆత్మవిమర్శ… ఓటమిపై సమీక్ష
ఒక్క ఓటమి ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ బీఆరెస్ లో పెద్దగా మార్పు కనిపించడంలేదు. పాత పద్ధతిలో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. ఓటమికి, ఈ పరిస్థితికి కారణాలేంటివనీ ఇప్పటి వరకు ఆత్మవిమర్శ చేసుకున్నదిలేదు. తెలంగాణ భవన్ లో సమీక్షలు నిర్వహించామని చెబుతున్నప్పటికీ అవన్నీ లోక్ సభ ఎన్నికల సమావేశాలుగా కొనసాగాయని చెబుతున్నారు.
ఎన్నికలు మెడమీద ఉన్నందున జరిగిన తప్పులను ఏకరువుపెడితే నాయకత్వం పై విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉందని లోతైన సమీక్షకు వెనుకంజవేశారనే చర్చ సాగుతోంది. పార్టీ ముఖ్యనాయకత్వం తమ తీరు మార్చుకోకుండా, గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం పై చర్యలు చేపట్టకుంటే ఫిరాయింపులు సర్వ సాధారణమైన ఈ కాలంలో తెలంగాణ సెంటిమెంట్ పనిచేయని సందర్భంలో బీఆరెస్ లాంటి ప్రాంతీయ పార్టీని పరిరక్షించుకోవడం పరీక్షే.
ఆ పార్టీ అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికల సందర్భంగా క్షేత్రస్తాయిలో ప్రచారాన్ని కొనసాగించేందుకు బస్సు యాత్ర చేపట్టడం వల్ల కొంతైనా పార్టీ కేడర్ కు విశ్వాసం పెరుగుతోంది. ఎంపీ ఎన్నికల్లో కొంతైనా ఫలితాలు సానుకూలంగా వస్తే దాని నుంచి ఊపిరిపీల్చుకుని తర్వాత పార్టీని కింది నుంచి నిర్మాణం చేసుకునేందుకు చాన్సు దక్కుతోంది. కానీ, రెండు జాతీయ పార్టీలు పొంచి ఉన్న సందర్భంలో ఆ మాత్రం సమయం లభిస్తుందా? కేసీఆర్ వయస్సు తదితర కారణాల రీత్యా సాధ్యమవుతోందా? అనే సందేహాలున్నాయి.
‘అవిశ్వాసం’తో పార్టీ మార్పు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే క్షేత్రస్థాయిలో నాయకులు చేజారి పోవడం ప్రారంభమైంది. ముఖ్యంగా అందివచ్చిన అవిశ్వాస తీర్మానాలను వినియోగించుకుని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్ లను చేజిక్కించుకునే పని ఒక వైపు కొనసాగుతోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా ప్రజా తీర్పు నుంచి కోలుకోకముందే పార్లమెంట్ ఎన్నికలురావడం ‘అగ్ని పరీక్ష’గా మారింది. తిరిగి లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు పార్టీ సమాయత్తమవుతున్న తరుణంలో గట్టి దెబ్బతగిలింది. సిట్టింగు ఎంపీల్లో మెజార్టీ పార్టీ చేజారిపోయారు.
సగం మంది బీజేపీలో చేరితే మరికొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిన్నటి వరకు ఎంపీలుగా ఉన్న సిట్టింగుల్లో కొందరిని మార్చాలని పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుండగా పార్టీలు మారిపోయారు. కొందరు టికెట్ రాదని మారిపోతే, మరికొందరు ఇతర పార్టీల్లో టికెట్ రావడంతో మారిపోయారు. కొందరు మాత్రం ఈ పార్టీ పక్షాన పోటీచేస్తే గెలవడం కష్టమని భావించి పార్టీ ఫిరాయించారు. అభ్యర్ధులుగా ప్రకటించిన తర్వాత గడ్డం రంజింత్ రెడ్డి, కడియం కావ్యలు కాంగ్రెస్ లో చేరిపోవడం ఆ పార్టీ గెలుపు గుర్రం కాకపోవడమే కారణమని చెప్పవచ్చు. రాష్ట్రలోని 17 స్థానాల్లో పోటీలో నిలుపగల నాయకులు ఆ పార్టీలో ఉన్నప్పటికీ నిన్న అధికారంలో ఉన్నప్పటికీ పరిస్థితికి, ఓటమి తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది.
కాంగ్రెస్ లక్ష్యంగా బీఆరెస్ విమర్శలు
తమను ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బీఆరెస్ తన దాడిని కొనసాగిస్తోంది. రాష్ట్రంలో తక్షణ ప్రత్యర్ధి కాంగ్రెస్ అయినప్పటికీ, బీజేపీ కూడా ఆ పార్టీని మింగేసేందుకు కాచుకకూర్చున్నదని తెలిసీ ఆ పార్టీని పెద్దగా విమర్శించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నప్పటికీ బీఆరెస్, బీజేపీ మధ్య దోస్తీ ఉందనే విమర్శలున్నాయి.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాలుగునెలల క్రితమే అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలనే హామీ ఇవ్వడం ఇప్పుడు బీఆరెస్ కు బీజీపీకి కూడా ఆయుధంగా మారింది. ప్రధానంగా బీఆరెస్ మాత్రం ఆరు గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి వాటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. కానీ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కాంగ్రెస్ కంటే, బీఆరెస్ కే ఎక్కువ తెలిసికూడా తమ రాజకీయ ప్రయోజనాలున్నందున ఆరు గ్యారంటీల అమలును టార్గెట్ చేస్తున్నారు.
మరో వైపు బీజేపీ మోదీ ఛరిష్మాపై ఆధారపడి ఎన్నికల్లో ముందుకు సాగుతోంది. ఈ త్రిముఖ పోటీలో బీఆరెస్ కనీసంగానైనా ఎంపీ స్థానాలు దక్కించుకుంటే పార్టీని నిలబెట్టుకునే అవకాశం ఉంది. తిరిగి పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించి చిత్తుశుద్ధితో ముందుకు పోతే తప్పితే అధికారానికి బాగా అలవాటు పడిన పార్టీలో వచ్చే ఐదేళ్ళ వరకు నాయకులు, కేడర్ ను కాపాడుకోవడం అంత ఈజీ కాదంటున్నారు.