ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన కాళేశ్వరం పంప్హౌస్ ఇంజనీర్లు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. కాళేశ్వరంపై కాగ్ నివేదికను కమిషన్కు సమర్పించగా, నిపుణుల కమిటీ కూడా తమ అధ్యయన నివేదికను అందజేసింది

నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా
16వరకు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. కాళేశ్వరంపై కాగ్ నివేదికను కమిషన్కు సమర్పించగా, నిపుణుల కమిటీ కూడా తమ అధ్యయన నివేదికను అందజేసింది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్టు ఇవ్వాలని మరోసారి కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. కమిషన్ ముందు సోమవారం 14 మంది పంప్ హౌస్ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ నెల 16 వరకు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇంజినీర్లకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆదేశాలు జారీ చేశారు.
అఫిడవిట్ల పరిశీలన తరువాత పలువురికి నోటీసులను ఇవ్వనున్నారు. సాక్ష్యాల నమోదు తర్వాత బహిరంగ విచారణ చేపట్టనుంది. కాగ్ రిపోర్ట్ పరిశీలన తరువాత స్టేట్ కాగ్ అధికారులను కమిషన్ విచారణకు పిలువనుంది. బ్యారేజీలతో పాటు పంప్ హౌస్ లపై కూడా ఎంక్వైరీ చేయాలని పలువురు కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో తాజాగా పంప్హౌజ్ నిర్మాణ సంస్థల ప్రతినిధులను, ఇంజనీర్లను విచారణకు పిలిచింది. దీంతో వారంతా నేడు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.