తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా విదేశీ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు మలేషియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా విదేశీ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు మలేషియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. లింకన్ యూనివర్సిటీ కాలేజీ తెలంగాణలో క్యాంపస్ ఏర్పాటు కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్, వోలోంగాంగ్ యూనివర్సిటీలు గుజరాత్లో తమ క్యాంపస్లను నెలకొల్పేందుకు ముందుకు ముందుకు వచ్చాయి. తాజాగా లింకన్ యూనివర్సిటీ కాలేజీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నది. లింకన్ వర్సిటీ కాలేజ్ను 2011లో ప్రైవేట్ వర్సిటీగా స్థాపించారు. పైవ్స్టార్ ర్యాంకింగ్ పొందిన ఈ వర్సిటీ టాప్ వర్సిటీల్లో ఒకటిగా ఉన్నది.
ప్రపంచ ప్రమాణాలతో కూడిన విదేశీ వర్సిటీలను దేశంలో నెలకొల్పుతామని కేంద్రం 2022-23 బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ వర్సిటీల ఏర్పాటుకు యూజీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) సిఫార్సులకు అనుగుణంగా విదేశీ విద్యాసంస్థలు భారత్లో ప్రవేశించేందుకు యూజీసీ వీలుకల్పించింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి దేశంలో విదేశీ వర్సిటీల ఏర్పాటు నోటిఫికేషన్ జారీచేసి, యూజీసీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ప్రత్యేకంగా యూజీసీ పోర్టల్ను తీసుకొచ్చింది.
అంతర్జాతీయ ర్యాకింగ్స్లో టాప్- 500లో గల వర్సిటీలు భారత్లో తమ వర్సిటీలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది యూజీసీ. ఈ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను నిర్వహిచేందుకు అనుమతిచ్చింది. మన దేశంలో ఒకటికి మించి క్యాంపస్ల ఏర్పాటుకు యూజీసీ అవకాశానిచ్చింది.