తెలంగాణ నుంచి టెంపోల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు ముడుతున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై నిజముంటే మరి మోదీ, ఈడీ, సీబీఐ ఏం చేస్తున్నారని, అంబానీ, అదానీలు రాహుల్ గాంధీకి డబ్బులు ఇస్తుంటే వారు కళ్లు మూసుకుని కూర్చున్నారా అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఘాటుగా కౌంటర్ వేశారు.
మోదీ..ఈడీ, సీబీఐలు ఏం చేస్తున్నాయి
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్
రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుంది
మోదీ అబద్దాల సర్ధార్
విధాత, హైదరాబాద్: తెలంగాణ నుంచి టెంపోల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు ముడుతున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై నిజముంటే మరి మోదీ, ఈడీ, సీబీఐ ఏం చేస్తున్నారని, అంబానీ, అదానీలు రాహుల్ గాంధీకి డబ్బులు ఇస్తుంటే వారు కళ్లు మూసుకుని కూర్చున్నారా అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఘాటుగా కౌంటర్ వేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ క్రిష్ణాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఖర్గే మాట్లాటారు. అదానీ, అంబానీ నుంచి కాంగ్రెస్కు డబ్బులు వెళ్తుంటే వారి ఇళ్లలో సోదాలు నిర్వహించాలేగాని, లాంటి చిల్లర మాటలు మాట్లాడటం ప్రధాని స్థాయికి తగదని చురకలేశారు. పబ్లిక్ సెక్టార్ ఆస్తులను ఆదానీ, అంబానీలకు మోదీ చౌకగా కట్టబెట్టారని ధ్వజమెత్తారు.
నల్లదనం వెలికితీస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారని, నల్లధనం ప్రయోజనాలు వారి మిత్రులకే అందజేశారని ఖర్గే ఆరోపించారు. నెల రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతున్నదని బీఆరెస్, బీజేపీ నేతలు చేస్తున్నవ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందని, ఐదేళ్ల పాటు తమ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిరాశలో ఉన్నవారే ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అధిక విడతల్లో ఎన్నికల నిర్వహణ ఎవరికి ఉపయోగంగా లేదని అయితే ఎన్నికల కమిషన్ విధానాల మేరకు అందరూ నడుచుకోవాలన్నారు. హైదరాబాద్ యూటీ నిర్ణయం జాతీయ స్థాయిలో జరిగే అంశమని, నాకైతే సంతోషమేనని, తిరగడానికి నాకు ఢిల్లీ కంటే హైదరాబాద్ దగ్గరవుతుందన్నారు.
అబద్ధాల సర్ధార్ మోదీ
ఎన్నికల ప్రచారంలో అబద్దాలతో మోడీ దేశ ప్రజల దృష్టి మరిల్చే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ అబద్ధాలకు సర్దార్ అని సెటైర్ వేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు పోటీయే కాదంటూనే పదేపదే విమర్శిస్తోందని, బీజేపీకి కాంగ్రెస్ నుంచి ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాజకీయాల్లోకి మతాన్ని లాగుతుందని ఖర్గే విమర్శించారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పి బీజేపీ ఓట్లు అడగకుండా కాంగ్రెస్పై నిందలు మోపడం ద్వారా ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ధనవంతుల ఆస్తులు లాక్కుని పంచుతామని మోదీ చెప్పడం సిగ్గుచేటని, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని గుర్తించాలన్నారు. మోడీకి ‘ఎం’ అనే అక్షం అంటే ఫియర్ అని.. అందువల్లే ఆ అక్షరంతో మొదలయ్యే మటన్, మొగల్, మంగళ సూత్రంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ దేశంలో మహిళల మంగళసూత్రాలు లాక్కునే ప్రధాని ఇంకా పుట్టనేలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతో చెబుతుందో అది ఖచ్చితంగా చేసి చూపిస్తుందన్నారు.
కర్ణాటకలో, తెలంగాణలో తామిచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. పదేళ్లకు ఓసారి లెక్కించాల్సిన దేశ జనాభాను మోడీ గణించలేదని, జనాభా లెక్కలు తీయడం ద్వారా ప్రభుత్వాలు పేద ప్రజలకు మెరుగైన కార్యక్రమాలు అమలు చేయవచ్చన్నారు. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో అనేక పరిశ్రమలు వచ్చాయని బీజేపీ హయాంలో రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టులు ఏం తీసుకువచ్చారో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల కోడ్తో హామీల అమలులో జాప్యం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తామిచ్చిన ఆరు గ్యారెంటీలల్లో ఇప్పటి వరకు ఐదు గ్యారెంటీలను అమలు చేశామని ఎన్నికల కోడ్ కారణంగా మరో గ్యారెంటీ అమలు చేయలేకపోయామని ఖర్గే చెప్పారు.అలాగే రైతులకు 2లక్షల రుణమాఫీ ఎన్నికల ముగిశాక అమలు చేస్తారన్నారు. తాము చెప్పిన హామీలు తప్పక నెరవేరుస్తామన్నారు. రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేశామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామన్నారు. రాష్ట్రంలో పేద మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు.