కాంగ్రెస్ను గెలిపించాలనే నిర్ణయానికి వచ్చిన ప్రజలు: మల్లు రవి

- కాంగ్రెస్లో చేరుతున్న బీఆరెస్,బీజేపీ పెద్ద నేతలు
- మూల సిద్దాంతాలకు విరుద్దంగా జేపీ మాట్లాడుతున్నారు
- పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి
విధాత, హైదరాబాద్: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు. అందుకే బీఆరెస్ ,బీజేపీ పెద్ద నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్య పరిపాలన వస్తుందని ,సామజిక న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే ప్రజలున్నారన్నారు. బీఆరెస్ ప్రభుత్వానికి ప్రజలు మధ్య ఆగాధం ఏర్పడిందన్నారు. ఇష్టారీతిన కేసులు పెట్టి ప్రజలను వేదిస్తున్నారని తెలిపారు. ప్రజా పాలన రావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని, పెత్తందారి పాలన కావాలంటే బీఆరెస్ కి ఓటేయాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు.
బీఆరెస్వి ఎలా సాధ్యమవుతాయి
లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడాన్ని మల్లు రవి తప్పుపట్టారు. జేపీ తానే స్థాపించిన పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడన్నారు. బీఆరెస్ ప్రభుత్వాన్ని మంచి పాలన లాగా చెబుతున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ సాధ్యంకాదన్న జేపీ వైఖరిని తప్పు పట్టారు. తమ పార్టీ ఆరు గ్యారెంటీలే అమలు సాధ్యం కానప్పుడు తమ కంటే అధికంగా ఇచ్చిన బీఆరెస్ హామీల అమలు ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని జేపీని నిలదీశారు. జేపీని అడ్డం పెట్టుకొని బీఆరెస్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమేనని, అది మా హైకమాండ్ చూసుకుంటుందన్నారు. బీఆరెస్ ని ఎదుర్కునేది కాంగ్రెస్ కాబట్టే రాజ్ గోపాల్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ వైపు వస్తున్నారని మల్లు రవి చెప్పారు.