Minister Sridhar Babu | రూ.500 కోట్ల పెట్టుబడితో పీఎస్‌ఆర్ కంపెనీ పెట్టుబడులు: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు నెలకొల్పేందుకు పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్ ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు

Minister Sridhar Babu | రూ.500 కోట్ల పెట్టుబడితో పీఎస్‌ఆర్ కంపెనీ పెట్టుబడులు: మంత్రి శ్రీధర్ బాబు

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు నెలకొల్పేందుకు పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్ ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, ‘పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్ ఛైర్మన్ రంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్ సంస్థ ఎలక్ట్రానిక్, ఐటీ, ఇతర ఉత్పత్తుల పరిశ్రలపై రూ.500 కోట్లు పెట్టుబడి పెడుతుందని, అమెరికా టెలికాం దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ నుంచి సాంకేతిక పరిజ్ణానం బదిలీకి పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్ ఒప్పందం చేసుకుందని ఆయన తెలిపారు.. ఈ పరిశ్రమల ఏర్పాటుతో రానున్న మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

ఇటీవల అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ యాజమాన్యం, పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్ తన సమక్షంలో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని అన్నారు. అనంతరం సాంకేతికత బదిలీకి మైక్రోలింక్ అంగీకరించిందని శ్రీధర్ బాబు తెలిపారు. డేటా ట్రాన్స్ మిషన్, నెట్ వర్కింగ్ కేబుల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మల్టీ లెవెల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ గ్లోబల్ లీడర్ గా ఉందని చెప్పారు. ఆ కంపెనీ టెక్నాలజీతో పీఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణాలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరతలేదని శ్రీధర్ బాబు వెల్లడించారు. సమావేశంలో పీఎస్ర్‌ ఇండస్ట్రీస్ ఛైర్మన్ రంగారావు, డైరెక్టర్ నమ్యుత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మరాజు చక్రవరం, మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు డా. డెనిస్ మొటావా, సియాన్ ఫిలిప్స్, జో జోగ్భి, సుమన్ వల్లపురెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.