కాళేశ్వరం అవకతవకలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ పి. చంద్ర ఘోష్ కమిషన్తో ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు
కాళేశ్వరం అక్రమాలపై విచారణ ప్రారంభించిన కమిషన్
విధాత : కాళేశ్వరం అవకతవకలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ పి. చంద్ర ఘోష్ కమిషన్తో ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై కమిషన్ విచారణ ఇదే రోజు ప్రారంభమైంది. కమిషన్ విచారణ చేపట్టిన మొదటిరోజు కావడంతో కమిషన్ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను మంత్రి విజ్ఞప్తి చేశారు. కమిషన్ అడిగిన వివరాలు, కమీషన్కు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని కమిషన్కు ఉత్తమ్కుమార్ స్పష్టం చేశారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. జస్టిస్ చంద్ర ఘోష్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వయిరీకి చీఫ్గా జస్టిస్ చంద్ర ఘోష్ ఉన్నారన్నారు. మేడిగడ్డ నిజానిజాలు తేల్చడానికే ప్రభుత్వం కమిషన్లు వేసిందన్నారు. చంద్ర ఘోష్కు లీగల్ అంశాలపై పూర్తిస్థాయి అవగాహన ఉందని తెలిపారు. కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ మొదలైందన్నారు. ఎన్డీఎస్ఏ నుంచి మరో నాలుగైదు రోజుల్లో తాత్కాలిక రిపోర్ట్ వస్తుందని చెప్పారు. మేడిగడ్డ అంశంపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే కార్యచరణ ఉంటుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. అవకాశం ఉంటే బ్యారేజీలకు మరమ్మతులు చేసి వచ్చే సీజన్లో ఉపయోగంలోకి తేవాలని చూస్తున్నామన్నారు.
ప్రారంభమైన విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్ విచారణ గురువారం ప్రారంభమైంది. వారికి కేటాయించిన బీఆరెకే భవన్ళో కమిషన్ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్రావు హాజరయ్యారు. మేడిగడ్డపై కమిషన్కు నోడేల్ టీం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మేడిగడ్డకు సంబంధించిన డాక్యుమెంట్స్ను కమిషన్కు ప్రభుత్వం ఇవ్వనుంది.
ఈ సందర్భంగా చంద్రఘోష్ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో కాళేశ్వరంపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తామని తెలిపారు. నిపుణుల అభిప్రాయాలు తీసుకొని విచారిస్తామన్నారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఇంజనీర్లు, ఎన్డీఎస్ఏ అథారిటీతోను సమావేశం అవుతామని, టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకొని విచారిస్తామని స్పష్టం చేశారు.