టీబీజీకేఎస్ గెలుపు సింగరేణికి అవసరం

సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం

టీబీజీకేఎస్ గెలుపు సింగరేణికి అవసరం
  • కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వం
  • కాంగ్రెస్ ప్రాధాన్యతల్లో సింగరేణి సంస్థ, కార్మికులు ఉండరు
  • టీబీజీకేఎస్ గౌరవాఅధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని, సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమని, సింగరేణి అంటే సింహగర్జన అని, అదే స్పూర్తితో పనిచేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సింగరేణి సంస్థ ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ సంఘం నాయకులు, ముఖ్య కార్యకర్తలు గురువారం హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో బొగ్గు గని కార్మికులు ప్రధాన భూమిక పోషించారని, సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్పూర్తి జాతీయ సంఘాలకు లేదని అన్నారు. గనుల్లో కార్మికులు చేస్తున్న కష్టం, చిందిస్తున్న చెమట తెలంగాణలో వెలుగులు నింపుతోందని, ధైర్యంగా పోరాటం చేయాలని దిశానిర్ధేశం చేశారు. అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించామని, ఈ సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు.

ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని, అతిత్వరలో సంఘం మ్యానిఫెస్టోను విడుదల చేస్తుందని ప్రకటించారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వంటి జాతీయ సంఘాలు సింగరేణి హక్కులను ఏనాడూ కాపాడలేదని, భవిష్యత్తులోనూ సింగరేణి ఎదుగుదల కోసం ఏమీ చేయలేవని విమర్శించారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండగా ఒక్క సమ్మె కూడా చేసే అవసరం లేకుండా అన్ని పనులను సాధించి పెట్టామని తెలిపారు. సింగరేణి అంటే తమకు ప్రాధాన్యత ఉందని, కానీ కాంగ్రెస్ ప్రాధాన్యతల్లో సింగరేణి, ఆ సంస్థ కార్మికులు లేరని తేల్చిచెప్పారు. తమకు పోరాటాలు కొత్తకాదని, కార్మికుల హక్కులను సాధించే వరకు విశ్రమించబోమని, కార్మికుల పక్షాన ప్రతి నిత్యం నిలబడి ఉంటామని పునరుద్ఘాటించారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కొంతమంది కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, అధికారులు కుదరదని చెప్పినా సరే.. కేసీఆర్ నిబంధనలను సవరించి వీలైనంత ఎక్కువమందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టారని వివరించారు. కేసీఆర్ చేసిన పనులను కార్మికులకు సరిగ్గా చెబితే టీబీజీకేఎస్ కు ఎదురుండదన్నారు.