బీఆరెస్ నాడు.. నేడు ప్రకటనపై రేవంత్ ఫైర్‌

బీఆరెస్ పార్టీ నాడు నేడు తెలంగాణ ఎట్లుండే అంటూ సాగిస్తున్న ఎన్నికల ప్రచార ప్రకటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు

బీఆరెస్ నాడు.. నేడు ప్రకటనపై రేవంత్ ఫైర్‌
  • ఘాటైన విమర్శలతో ఎదురుదాడి
  • 24గంటల ఉచిత విద్యుత్తుపై చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్‌
  • నిరూపిస్తే నామినేషన్లు ఉపసంహరించుకుంటానన్న రేవంత్‌


విధాత: బీఆరెస్ పార్టీ నాడు నేడు తెలంగాణ ఎట్లుండే అంటూ సాగిస్తున్న ఎన్నికల ప్రచార ప్రకటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కామారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి బీఆరెస్ నాడు నేడు ప్రకటనపై విమర్శలు గుప్పిస్తూ అందులోని అంశాలపై ఎదురుదాడి చేశారు.


2004లో రబ్బర్ చెప్పులతో వచ్చిన హరీశ్‌రావు ఆనాడు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ లాంటి వాళ్లకు దగ్గరకు వచ్చి చాయ్ ఖర్చులకు అడుక్కుంటుండేనని, ఇవాళ విమానాల్లో తిరుగుతుండని కౌంటర్ వేశారు. నాడు బతుకమ్మ ఆటపాటలతో తిరిగే కవితమ్మ ఇవాళ బెంజీకార్లలో విమానాల్లో తిరుగుతుందన్నారు.


నాడు తంగడపూలు, బంతిపూల బతుకమ్మలు ఉంటే నేడు కవిత పుణ్యమా అని ఫ్లాస్టిక్ పూల బతుకమ్మగా మారిందన్నారు. నాడు విద్యార్థులు బడికిపోయేదని, నిరుద్యోగులు ఉద్యోగాలకు పోయేదని నేడు విద్యార్థులు ఒక చేతిలో బీరు సీసా, ఇంకవైపు బీఆరెస్ జెండా పట్టుకుని తిరుగుతున్నారన్నారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యల పాలవుతున్నారన్నారు.


తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మారిందన్నారు. నాడు పూటకు గతిలేని కేసీఆర్‌కు నేడు వేలకోట్లు, లక్ష కోట్లకు పడిగెత్తిండన్నారు. నాడు అమెరికాలో బాత్‌రూమ్‌లు కడిగిన కేటీఆర్ నేడు విమానాల్లో తిరుగుతుండని, సినిమావాళ్లతో గెస్ట్‌హౌజ్‌లలో కనిపిస్తుండన్నారు. నాడు 2004నుంచి 2014వరకు పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఉచిత విద్యుత్తు, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో కార్పోరేట్ విద్య, ఆరోగ్యశ్రీ తో పేదలకు కార్పోరేట్ వైద్యం అందించామన్నారు.


మైనార్టీలకు రిజర్వేషన్లు,గిరిజన రైతులకు పోడు పట్టాలిచ్చామన్నారు. ముస్లిం, సిక్కు మైనార్టీలందరికి అభ్యుఉన్నతికి పనిచేశామని, నాడు కవులు , కళాకారులు జై తెలంగాణ నినాదాలతో ఉద్యమం ఉవ్వేత్తున నిర్వహించారని, నేడు ధర్నాచౌక్ ఎత్తివేసి, ప్రజా ఉద్యమాలపై పోలీసులతో ఉక్కు పాదం మోపుతున్నారన్నారు. మా పదేళ్ల పాలనపైన, మీ పదేళ్ల పాలనపై చర్చ పెడుదాం..నీవు వస్తావో..నీ కుటుంబ సభ్యులోస్తారో రండి కామారెడ్డి చౌరస్తాలో చర్చకు పెడుదామని సవాల్ చేశారు.


నాడు మీడియా ప్రతినిధుల యాజమాన్యలు ఎట్లా ఉన్నా..వారంతా స్వేచ్చగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, వారి గుర్తింపు ప్రభుత్వ కార్డులు, ఇళ్ల పట్టాలు, ఇండ్లు ఇచ్చామని, నేడు అవన్ని లేకపోగా బెదిరంపులకు పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, కవిత, సంతోష్‌ల ఆస్తులు నాడు ఎన్ని నేడు ఎన్నో 2004 నుంచి వివిధ ఎన్నికల్లో వారు సమర్పించిన అఫిడవిట్‌లు చూసిన తేలిపోతుందన్నారు. నాడు చెప్పులు, బువ్వ గతి లేని కేసీఆర్‌కు నేడు వేల కోట్లు ఎలా వచ్చాయన్నారు.


ఉద్యంమం పేరుతో నాలుగైదు రోజులు పస్తులున్నామని చెప్పిన నీకే ఇన్ని ఆస్తులుంటే ఉద్యమంలో అమరులైన, జైలుపాలైన తెలంగాణ విద్యార్థులకు ఇంకెన్ని ఆస్తులివ్వాలని ప్రశిస్తున్నానన్నారు. కేసీఆర్‌కు పంజాగుట్టలో 10ఎకరాలలో 150బెడ్‌రూమ్‌ల ఇల్లు, గజ్వేల్‌లో 1000ఎకరాల ఫామ్‌హౌజ్‌, జన్వాడలో కేటీఆర్‌కు 100ఎకరాల ఫామ్‌హౌజ్, బిడ్డకు, అల్లుళ్లకు ఫామ్‌హౌజ్‌లు కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చాయని రేవంత నిలదీశారు.


నాడు నేడు హైద్రాబాద్ ఎట్లుండంటున్నారని, నాడు కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అవుర్ రింగ్ రోడ్డు కట్టామని, హైటెక్ సిటీ, గచ్చిబౌలి స్టేడియం, మెట్రో రైలు, అంతర్జాతీయ ఏయిర్ పోర్టు, ఐటీలు, నల్సార్ యూనివర్సిటీ, జిల్లాకో యూనివర్సిటీలు కట్టామన్నారు. నాడు 10,500కోట్ల లిక్కర్ అమ్మితే నేడు 36వేల కోట్ల లిక్కర్ అమ్ముతున్నారని, గల్లీకో బెల్ట్ షాపు తెచ్చి తెలంగాణను బొందల గడ్డ చేసినారన్నారు.


ఉచిత విద్యుత్తు అమలు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్‌


24గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామంటున్న కేసీఆర్‌కు దమ్ముంటే నాతో చర్చకు వచ్చి నిరూపిస్తే నా నామినేషన్లు ఉపసంహరించుకుంటానని రేవంత రెడ్డి సవాల్ చేశారు. ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ దేనిని, రాష్ట్రంలో గత ఆరు నెలలుగా ఉచిత కరెంటు ఇస్తున్నట్టుగా నిబద్ధత ఉంటే చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.


సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, కామారెడ్డి ఎక్కడికైనా వస్తా నీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని తీసుకొని కామారెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు రా 24 గంటలు కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే కామారెడ్డి, కొడంగల్ లో నా నామినేషన్ ఉపసంహరించుకుంటానని, నా సవాల్‌కు కేసీఆర్ సిద్ధం కావాలన్నారు.


మధ్యాహ్నం మూడు గంటల దాకా సమయం ఉందని సవాల్ చేశారు. కామారెడ్డి లో మిడతల దండు, దండుపాళ్యం బీఆరెస్ ముఠాలను తరిమి కొట్టాలన్నారు. ఈ ఎన్నిక కామారెడ్డి, తెలంగాణకు మాత్రమే చెందినది కాదని దేశ చరిత్రనే కీలక మలుపు తిప్పే ఎన్నికని, గర్వానికి, అగర్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ప్రజలను మభ్యపెట్టి డబ్బులు, మద్యంతో కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసి ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు బంద్ అవ్వడం కాదు మీ ఒంట్లో మీ ఇంట్లో కరెంటు తీసేస్తామని అప్పుడు దేవదాసులా గజ్వేల్ ఫామ్ హౌస్ లో మందేసి చెట్ల మధ్య తిరగాలన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు కరువు వస్తుంది కర్ఫ్యూ వస్తుందని కేసీఆర్ ఏమైనా జాతకాలు చెబుతున్నారా అని ఎద్దేవా చేశారు.


కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా 24 గంటలు కరెంటు గురించి మాట్లాడరని, నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మాట్లాడరని, మిషన్ కాకతీయ మీద మాట్లాడరని ఎందుకంటే కమిషన్ల గురించి అడుగుతారని భయపడతారని విమర్శించారు. కాళేశ్వరం గొప్పలు చెప్పడం లేదని ఎందుకంటే మేడిగడ్డ, సుందిళ్ల గురించి ప్రశ్నిస్తారని భయపడుతున్నారన్నారు.


పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ఊసెత్తడం లేదన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలో అమలు చేయని వాళ్ళు ఇక్కడ అమలు చేస్తారా అని అడుగుతున్నారని. కర్ణాటకలో కాంగ్రెస్ ఓడితే బీజేపీని గెలిపించాలని అనుకున్నావా అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ, ఎంఐఎం కలిసి బీఆరెస్ గెలుపుకు కంకణం కట్టుకున్నాయన్నారు.