ఇక నుంచి తహశీల్దార్ల పై కేసులు నమోదు చేయాలంటే.. మామూలు విషయం కాదు…

ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా, లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తాసీల్దార్లకు, రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

ఇక నుంచి తహశీల్దార్ల పై కేసులు నమోదు చేయాలంటే.. మామూలు విషయం కాదు…

సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన
అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురి కావొద్దు
రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్
ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం
33 జిల్లాల తహశీల్దార్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి

ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా, లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తాసీల్దార్లకు, రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, పేదలు, సామాన్యులకు వీలైనంత మేరకు చేయగలిగినంత సహాయం చేయాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పేదసామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. విధి విధానాలు రూపొందిస్తుందన్నారు. దానికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు పని చేయాలన్నారు.

ఆదివారం షామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో 33 జిల్లాల తహశీల్దార్లతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కాపాడుతూ, పేదలకు సహాయం అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని, మరింత వేగం పెరగాలన్నారు. ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణలకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది పూర్తిగా సహకరించి, వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి తాసీల్దార్లను కోరారు. రెవెన్యూ ఉద్యోగులు మరింత పట్టుదలతో సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సామాన్యులకు మేలు చేసేలా..

సామాన్యులకు, రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఈ చట్టానికి సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగ పరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి, బలోపేతం చేసే దిశగా పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు.

పథకాల అమలులో….

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారులను గుర్తించడంలోను, వారికి సంక్షేమ పథకాలను అందించడంలోను రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమైనదని మంత్రి అన్నారు. ఇందులో తహశీల్దార్ల పాత్ర అతి ముఖ్యమైనదని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుందని పొంగులేటి తెలిపారు. ఈ విభాగం సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరి ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయన్నారు.

కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్న తరువాతే…

కలెక్టర్ నుండి అనుమతి తీసుకున్న తర్వాతే తహశీల్దార్ల మీద కేసులు నమోదు చేసేలా రాష్ట్ర డీజీ‌పితో చర్చించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఉద్యోగులకు మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రెవెన్యూ సిబ్బంది కోసం హైదరాబాద్ లో ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

బీఆరెస్ సర్కారు మండలాల సంఖ్య పెంచింది కానీ ….

గత ప్రభుత్వం హడావుడిగా మండలాల సంఖ్యను పెంచింది కానీ, దానికి తగినట్టుగా కార్యాలయాలను ఏర్పాటు చేయలేదని మంత్రి అన్నారు, చేసిన అవసర మైన మేరకు సిబ్బందిని కూడా నియమించలేదన్నారు. తహశీల్దార్ల కార్యాలయాలలో మౌళిక వసతులను కల్పించడంతో పాటు రెగ్యులర్ స్టాఫ్, పదోన్నతులు, కోర్టు ఖర్చులు, అద్దె భవనాలు, అద్దె వాహన బకాయిలతో పాటు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తాసీల్దార్లకు హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహశీల్దార్ల బదిలీలపై ఉద్యోగ సంఘాలతో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రజలకు మేలు జరగాలంటే…

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి అత్యంత కీలకమైనదని ఈ శాఖ బాగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని,, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. దాదాపు ఐదు సంవత్సరాలనుంచి పెండింగ్ లో ఉన్న 300 మంది ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్ మెంట్ ఫైళ్లను మంత్రి క్లియర్ చేశారని వెల్లడించారు.

గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను ఏకరువు పెట్టిన తాసీల్దార్లు

సుధీర్ఘంగా జరిగిన ఈ సమేవేశంలో దాదాపు రెండు గంటలపాటు వివిధ జిల్లాలనుంచి వచ్చిన తహశీల్దార్లు గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను వాటి వల్ల ప్రజలు ఎదురుకొన్న ఇబ్బందులను భవిష్యత్తులో ఏ విధంగా చేస్తే బాగుంటుందని పలు అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొత్రు, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వి. లచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ట్రెసా అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.