బిడ్డా కేటీఆర్.. గుర్తు పెట్టుకో.. నీ అధికారం 45 రోజులే
బిడ్డా కేటీఆర్.. గుర్తు పెట్టుకో నీ అధికారం 45 రోజులే. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హెచ్చరించారు

విధాత, హైదరాబాద్: బిడ్డా కేటీఆర్.. గుర్తు పెట్టుకో నీ అధికారం 45 రోజులే. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్న 75 మంది లిస్టును తయారు చేశారట, ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఇచ్చారని వెల్లడించారు. కొంతమందిని కేటీఆర్ స్వయంగా బెదిరిస్తున్నారట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంతకు ఇంత మిత్తితో చెల్లిస్తామని హెచ్చరించారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసు పెడితే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై నిఘా పెట్టారు, వారి ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.

అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారు, అధికారులు అధికారుల్లా వ్యవహరించండి, బీఆరెస్ కార్యకర్తల్లా కాదన్నారు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందంటూ బిల్లా రంగాలు చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ , ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కాంగ్రెస్ పార్టీవి కాదా అని ప్రశ్నించారు. చివరకు కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న ఈ పదవులు కాంగ్రెస్ పెట్టిన బిక్ష, సోనియమ్మ దయ అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజలను మోసగించినట్లే సోనియా గాంధీని కూడా మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.అందుకే సెప్టెంబర్ 17న సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారని, అధికారంలోకి రాగానే వాటిపై సంతకం చేస్తామన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్ లా మాట్లాడుతున్నారని, నన్ను భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలంటున్నారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చేందుకు నేను సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలారా 45 రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదేనని శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు.