చదివింది ఎంబీఏ చేసేది సైబర్‌ నేరాలు.. ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు

తాను చదివింది ఎంబీఏ.. చేసేది మాత్రం సైబర్‌ నేరాలు. పైగా ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగుల నుండి లక్షలు వసూలు చేశారు.

చదివింది ఎంబీఏ చేసేది సైబర్‌ నేరాలు.. ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు

సైబర్‌ నేరస్థుడు సాయితేజ అరెస్టు

విధాత, వరంగల్ ప్రతినిధి: తాను చదివింది ఎంబీఏ.. చేసేది మాత్రం సైబర్‌ నేరాలు. పైగా ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగుల నుండి లక్షలు వసూలు చేశారు. ఈ సైబర్‌ నేరస్థుడిని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సైబర్‌ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సైబర్‌ కేటుగాడు నుండి పోలీసులు సుమారు రెండు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి సైబర్‌ క్రైమ్‌ విభాగం ఎసిపి విజయ్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు.

అంద్రప్రదేశ్‌ ఏలూరు జిల్లా, చట్రాయి మండలం, చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన పొనగంటి సాయితేజ (28) ఎంబీఏ పట్టా అందుకున్న నిందితుడు కొన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో పాటు జల్సాలకు అలావాటు పడ్డాడు. దీనితో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తనకు ఉన్న కంప్యూటర్‌ పరిజ్ఞానంతో ఉద్యోగావకాశాలు కల్పించే కొన్ని వెబ్‌ సైట్లను వేదికగా ఎంచుకున్నాడు. ఈ వెబ్‌సైట్లలో తమ వివరాలను నమోదు చేసుకున్న నిరుద్యోగులకు సంబంధించిన సెల్‌ఫోన్‌ నంబర్లను సేకరించి సంబంధిత నిరుద్యోగులకు బ్యాక్‌ డోర్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగఅవకాశాలు కల్పిస్తానని వారి ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపించేవాడు.

ఇలాంటి మేసేజ్‌లకు స్పందించే నిరుద్యోగుల నుండి ఈ సైబర్‌ నేరగాడు ఇంటర్యూ, పరీక్షలు, ట్రైనింగ్‌ అంటూ నిరుద్యోగుల నుండి నిందితుడు లక్షల్లో డబ్బు వసూళ్ళకు పాల్పడేవాడు. ఇదే తరహలో నిందితుడు సాయితేజ హనుమకొండ ప్రాంతంలోని ఓ నిరుద్యోగి నుండి సూమారు మూడు లక్షలకుపైగా డబ్బులు వసూలు చేసి ఫోన్‌ స్వీచ్‌ఆఫ్‌ చేయడంతో ఖంగుతిన్న భాధితుడు తాను మోసపోయినట్లుగా గుర్తించి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ఫిర్యాదు చేశారు.

తక్షణమే స్పందించి కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులు పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తు బృందం సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూమారు 35 మంది నిరుద్యోగుల నుండి సూమారు 45 లక్షల రూపాయలను వసూళ్ళు చేసినట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ క్రైమ్స్‌ విభాగం ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారి అతి కొద్ది సమయంలో కేసు నమోదు చేసి నిందితుడు పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసిపి విజయ్‌కుమార్‌, ఇన్స్‌స్పెక్టర్‌ రవి, ఎస్‌.ఐలు శివ, చరణ్‌ కానిస్టేబుళ్ళు ఆంజనేయులు, మహేందర్‌,రాజు, సంపత్‌లను పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.