Viral News | అమ్మో.. ఇంత శాడిస్టులా! పక్కింటోళ్లకు దెయ్యాల కథలు వినిపిస్తూ టార్చర్!

Viral News | చైనాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కింటోళ్ల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు పొద్దున్నుంచి రాత్రి దాకా దెయ్యాల కథలు లౌడ్ స్పీకర్‌లో వినిపిస్తూ టార్చర్ పెట్టాడు. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో తన పగకు బ్రేక్ వేశాడు.

Reported by: Chandram | వైరల్ న్యూస్ | Apr 04, 2026, 8:07 pm IST
Read Time: 4 mins
Viral News | అమ్మో.. ఇంత శాడిస్టులా! పక్కింటోళ్లకు దెయ్యాల కథలు వినిపిస్తూ టార్చర్!

Viral News | ఇరుగు పొరుగు అన్న తర్వాత అప్పుడప్పుడు గొడవలు జరగడం సహజమే. అలా విబేధాలు వచ్చినప్పుడు కొద్దిరోజులు మాట్లాడకుండా ఉంటారు.. కానీ వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవడమే పనిగా అయితే పెట్టుకోరు.. కానీ చైనాలో ఓ వ్యక్తి మాత్రం దాన్నే పనిగా పెట్టుకున్నాడు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పక్కింటోళ్లకు లౌడ్ స్పీకర్‌లో దెయ్యం కథలు వినిపిస్తూ చుక్కలు చూపించాడు.

చైనా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌జౌ నగరంలో లూ, లీ అనే ఇద్దరు మిత్రులు ఒకే రూమ్‌లో కలిసి ఉంటారు. వారి ఇంటి పక్కనే జీ ఉంటాడు. వీరిద్దరి ఇంటికి మధ్యలో ఒక గోడ మాత్రమే అడ్డుగా ఉంటుంది. అయితే కొద్దిరోజుల క్రితం వీరి మధ్య ఏదో గొడవ జరిగింది. దీంతో జీ మీద లూ, లీ ఇద్దరూ పగబట్టారు. అతని మీద ప్రతీకారం తీర్చుకునేందుకు వారి ఇళ్ల మధ్య ఉన్న గోడ పక్కన స్పీకర్లు పెట్టి దెయ్యాల కథలను వినిపించడం మొదలుపెట్టారు. ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆపై మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నాన్‌స్టాప్‌గా భయంకరమైన శబ్దాలతో హారర్ స్టోరీలను వినిపించేవారు.

అయితే లూ, లీ చేసిన పనికి పక్కింట్లో ఉండే జీ మాత్రమే కాకుండా.. పై అంతస్తులో ఉండే కుయి అని వ్యక్తి కుటుంబం కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది. కుయి కుమారుడు పరీక్షలకు ప్రిపేర్ అవుతుండటంతో లీ పెట్టే శబ్దాలకు బాగా డిస్ట్రబ్ అయ్యేవాడు. దీంతో కుయి పోలీసులను ఆశ్రయించాడు. కానీ నిబంధనల ప్రకారం లూ, లీ పెట్టిన శబ్దాలు 36 డెసిబల్స్ మాత్రమే నమోదైంది. నిబంధనల ప్రకారం పగటిపూట 60 డెసిబల్స్, రాత్రి 50 డెసిబల్స్ పరిమితి ఉంటుంది. లూ పెట్టిన శబ్దాలు అంతకంటే తక్కువగానే చట్టబద్ధంగా ఉండటంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.

చివరకు కుయి ఫ్యామిలీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. జరిగింది మొత్తం తెలుసుకున్న న్యాయస్థానం లూ చేష్టలపై మండిపడింది. లూ కావాలనే ఇలా చేస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని అభిప్రాయపడింది. వెంటనే స్పీకర్లను తొలగించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారుల సమక్షంలో లూ వాటిని తొలగించారు. మరోసారి ఇలా చేయనని లూ హామీ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడింది. అయితే ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Read More:

Coffin Sessions | మరణానికి ముందే శవపేటికలో గడుపుతున్న యువత.. ఏంటీ ఈ ట్రెండ్!

అయోధ్యలో 200 ఏళ్ల నాటి రామాయణ రాతప్రతులు