పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనుసరిస్తున్న పొత్తుల వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పనిలోపని టీడీపీ, జనసేన తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు
అక్కడ కూటమి…ఇక్కడ ఒంటరి
ఏ రోటికాడ బీజేపీ ఆ పాట
జనసేన, టీడీపీ వైఖరి సేమ్
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు
పార్లమెంటు ఎన్నికల్లో దూరం దూరం
మూడు పక్షాలు ఎన్డీయే కూటమియే
ఎన్నికల్లో మూడింటి రూటే సపరేటు
విధాత ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనుసరిస్తున్న పొత్తుల వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పనిలోపని టీడీపీ, జనసేన తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల కురుక్షేత్రంలో ఎదుటివారి పై మాటల దాడి చేస్తున్న బీజేపీ తీరు గురువింద సామెతగా ఉందంటున్నారు. ఎదుటివారికి నీతులు చెబుతూ తమ దగ్గరికి వచ్చేసరికి ఏ ఒక్క సూత్రాన్ని పాటించడం లేదు.
ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని మరో చోట పొత్తు ఊసేత్తకపోవడంలో ఔచిత్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో బిజెపితో పాటు ఎదుటి పక్షాలు కూడా ఇదే రీతిలో వ్యవహరించడం విచిత్రం. మూడురాజకీయ పక్షాలు పూర్తి అవకాశవాద వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇందులో బిజెపి ఒక అడుగు ముందుకేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పైగా అన్ని పార్టీలు ఒకే కూటమిలో భాగస్వామ్య పార్టీలు కావడం మరో ఆసక్తికరమైన అంశం.
ఒకే కూటమి భిన్న వైఖరి
జాతీయంగా బిజెపి ,టిడిపి, జనసేన మూడు పార్టీలు తాజా ఎన్నికల ముందు ఎన్ డి ఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి, జనసేన కలిసి పోటీ చేశాయి.
అదేంటో కానీ పార్లమెంటు ఎన్నికలొచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తారు మారయ్యింది. ఇక్కడ బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుండగా టిడిపి, జనసేన పోటీ గురించి కూడా మాట్లాడకపోవడం విచిత్రం. పోనీ ఈ రెండు పార్టీలు కలిసి గాని, ఒంటరిగా గాని ఎన్నికల బరిలో లేనే లేవు. ఈ విషయంలో ఒక రాజకీయపార్టీలుగా నైతికబాధ్యతతో కూడిన ప్రకటన కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రాజకీయంగా పరిశీలిస్తే ఒకే కూటమిలోని పార్టీలు కలిసి పోటీ చేయాల్సి ఉండగా,తెలంగాణలో ఒక్క బీజేపీ మాత్రమే ఎన్నికల బరిలో ఉంది. మరి బిజెపికి జనసేన, టిడిపి తెలంగాణలో మద్దతు తెలియజేస్తున్నట్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ రాజకీయ విచిత్ర పరిణామాన్ని వింత అంశంగా పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం ఇది పచ్చి రాజకీయ అవకాశవాదానికి నిదర్శనంగా చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జనసేన పొత్తు
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. 8 స్థానాల్లో జనసేన తమ అభ్యర్థులను బరిలోకి నిలిపింది. పార్టీ ఆవిర్భావం అనంతరం తొలిసారి జనసేన తెలంగాణలో పోటీ చేసింది. మిగిలిన 111 స్థానాల్లో బిజెపి పోటీ చేసింది. ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రచారంలో భాగస్వామ్యం అయ్యా రు. కానీ ఒక్కచోట కూడా జనసేన అభ్యర్థి విజయం సాధించకపోగా బిజెపి కేవలం ఎనిమిది స్థానాలకు పరిమితమైంది. టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి లోను చేసింది.
ఈ ఎన్నికల్లో రెండు పార్టీల వైఖరేంటో
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ, అసెంబ్లీ ఎన్నిక ల్లో పోటీచేసి పార్లమెంట్ ఎన్నికల్లో దూరంగా ఉన్న జనసేన, తెలంగాణలో అనుసరించే వైఖరి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం బిజెపి మాత్రమే తెలంగాణలో ఒంటరిగా పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తాయా? పరోక్షంగా సహకరిస్తాయా తేలాల్సి ఉంది. ఈ రెండు వైఖరిలో దేనిని అనుసరించినప్పటికీ మూడు పార్టీలు అవకాశవాద వైఖరి అనుసరిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుందని రాజకీయ పండితులు సెలవిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జనసేన పార్టీ వల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లినందున జనసేనతో బిజెపి దూరంగా ఉన్నట్లు భావిస్తున్నారు. తొలిసారి పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన తెలంగాణలో ఖాతా తెరువకపోగా, డిపాజిట్లు కూడా లెక్కకు పోవడం పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించిందనే అభిప్రాయం ఆ పార్టీ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి దెబ్బ తగలకూడదని జాగ్రత్త వహించినట్లు చెబుతున్నారు. అయితే టిడిపి వైఖరి ఆసక్తికరంగా ఉందంటున్నారు.
ఏపీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పోటీకి దూరంగా ఉంటున్నామని ప్రకటించారు. ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటూ ఏ వైఖరిని తీసుకుంటుందోననే చర్చజరుగుతోంది. ఎన్డీయేకూటమిలోని బీజేపీకి మద్దతు ఇస్తారా? ఇవ్వరా? చూడాలంటున్నారు. అసెంబ్లీఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం వల్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసానితో సహా నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. మూడు ప్రధాన పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.