ధరణి సమస్యలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఫిబ్రవరి 24న జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది.
విధాత : ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. తన పనిని వేగంగా కొనసాగిస్తున్నది. ఇప్పటికే వివిధ శాఖ అధికారులతో సమావేశమైన కమిటీ సభ్యులు.. ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం పది గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 12 అంశాలను చర్చించనున్నారు. ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అందుకు కారణాలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. నిషిద్ధ జాబితాలో ఉన్న ఆస్తుల జాబితా, వాటిని సరిచేసేందుకు, అప్డేట్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు; అడహాక్ ల్యాండ్ ట్రిబ్యునళ్లు పరిష్కరించిన కేసులు, వాటి అనుభవాలు, వాటి ఆధారంగా ముందుకు వెళ్లే అంశం కూడా అజెండాలో ఉన్నది.
సాదా బైనామా దరఖాస్తుల పరిస్థితి. ఆరెస్సార్/ శేత్వార్ పొంతన లేకపోవడానికి సంబంధించిన అంశాలు; ఆర్వోఆర్ చట్టంలో చేయాల్సిన మార్పులు, వివిధ స్థాయిల్లో రెవెన్యూ అధికారుల పనితీరు, వివిధ స్థాయిల అధికారులకు (తాసిల్దార్/ ఆర్డీవో/ జేసీ) అధికారాల వికేంద్రీకరణపై చర్చిస్తారు. భూముల రిజిస్ట్రేషన్లలో సమస్యలు; ఇనాం, ఎవాక్యూ ప్రాపర్టీ సహా భూ వివాదాలు/ సమస్యలు/ ఆర్వోఆర్ కాకుండా ఇతర చట్టాల కింద కేసుల ప్రస్తుత పరిస్థితి, సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించేందుకు మార్గాలపై కలెక్టర్లతో చర్చిస్తారు. గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యలు; రెవెన్యూ-అటవీ వివాదాలు; ఎండోమెంట్, వక్ఫ్ భూముల వివాదాలు, ఉత్తమ భూ పరిపాలన కోసం రెవెన్యూ వ్యవస్థలో అవసరమైన మార్పులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.